BCCI To Review Policy On Retired Player's Participation In Overseas T20 Leagues - Sakshi
Sakshi News home page

BCCI: బీసీసీఐ కీలక నిర్ణయం! వాళ్లకు ఊరటనిచ్చేలా.. ఇక ధావన్‌ కెప్టెన్‌గా..

Jun 29 2023 6:31 PM | Updated on Jun 29 2023 6:55 PM

BCCI To Review Policy On Retired Players Participation In Overseas T20 Leagues - Sakshi

ప్రపంచ దేశాల్లోని ఎంతో మంది క్రికెటర్లు ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో పాల్గొని పేరుకు పేరు.. డబ్బుకు డబ్బు సంపాదించుకుంటున్నారు. ప్రధాన జట్లతో పాటు అసోసియేట్‌ దేశాల ఆటగాళ్లు కూడా ఊహించని రీతిలో పేరు ప్రఖ్యాతులు సొంతం చేసుకునేందుకు క్యాష్‌ రిచ్‌ లీగ్‌ దోహదం చేస్తోంది. అయితే, మన క్రికెటర్లకు మాత్రం విదేశీ టీ20 లీగ్‌లలో ఆడే అవకాశం లేదు.

బంధం తెంచుకుంటేనే
ఒకవేళ ఎవరైనా అలా చేయాలనుకుంటే భారత క్రికెట్‌ నియంత్రణ మండలితో బంధాలన్నీ తెంచుకోవాల్సిందే. అంతర్జాతీయ, దేశవాళీ క్రికెట్‌తో పాటు ఐపీఎల్‌కు కూడా వీడ్కోలు పలికిన తర్వాతే విదేశీ టీ20 లీగ్‌లలో ఆడాల్సి ఉంటుంది. ఈ మేరకు బీసీసీఐ కట్టుదిట్టమైన నిబంధనలు విధించింది.

సమీక్ష నిర్వహించడం ద్వారా
అయితే, తాజాగా ఈ పాలసీపై సమీక్ష నిర్వహించేందుకు బోర్డు సిద్ధమైనట్లు సమాచారం. జూలై 7 నాటి అపెక్స్‌ కౌన్సిల్‌ మీటింగ్‌లో ఈ అంశంపై రివ్యూ చేయనున్నట్లు తెలుస్తోంది. కాగా అమెరికా జూలై నుంచి మేజర్‌ లీగ్‌ క్రికెట్‌(MLC) పేరిట టీ20 టోర్నీ నిర్వహించనుంది. 

మార్పులు చేసేందుకు సిద్ధం
ఇటీవల ఐపీఎల్‌కు గుడ్‌బై చెప్పిన ఆటగాళ్లు కొందరు ఈ లీగ్‌లో భాగమయ్యేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే బీసీసీఐ తమ పాత విధానంలో మార్పులు తీసుకురానున్నట్లు తెలుస్తోంది. దేశవాళీ క్రికెట్‌ ప్రమాణాలు పెంచడం సహా విదేశీ టీ20 లీగ్‌లలో ఆడేందుకు యువ ఆటగాళ్లు బోర్డుతో బంధం తెంచుకునే పరిస్థితులను చక్కదిద్దే దిశగా నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.

ఆ జట్టుకు కెప్టెన్‌గా ధావన్‌!
ముఖ్యంగా అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి రిటైరైన సీనియర్‌ ఆటగాళ్లకు దోహదం చేసేలా బోర్డు నిర్ణయం ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ అంశంతో పాటు ఏసియన్‌ గేమ్స్‌కు భారత పురుష, మహిళా జట్లను పంపే విషయంపై తుది నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. ఈ క్రమంలో సీనియర్‌ పురుషుల జట్టుకు వెటరన్‌ ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ సారథ్యం వహించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ప్రధాన ఆటగాళ్లు వరల్డ్‌కప్‌-2023 సన్నాహకాలతో బిజీగా ఉండనున్న తరుణంలో గబ్బర్‌ సారథ్యంలో ద్వితీయ శ్రేణి జట్టును చైనాకు పంపే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. కాగా సెప్టెంబరు 23 నుంచి అక్టోబరు 8 వరకు ఏసియన్‌ గేమ్స్‌ నిర్వహణకు షెడ్యూల్‌ విడుదలైంది.

చదవండి: మా వల్లే కిర్‌స్టన్‌కు పేరు.. ఆ తర్వాత అతడు సాధించింది సున్నా! మరి ద్రవిడ్‌..
18 నెలలు జట్టుకు దూరం.. వచ్చి ఒక్క మ్యాచ్‌ ఆడగానే! జడ్డూ..: గంగూలీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement