
న్యూఢిల్లీ: ఐపీఎల్ ఆటకు యూఏఈలో ఏర్పాట్లు జరుగుతుండగా... భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఇక్కడ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్ఓపీ)పై సమాలోచనలు చేస్తోంది. ఆటగాళ్ల రక్షణ కోసం ఏర్పాటు చేయబోయే జీవ భద్రత వలయంపై ప్రత్యేకంగా దృష్టిసారించిన బోర్డును అసలు కంటే కొసరు సమస్యే కాస్త తికమక పెడుతున్నట్లుంది. ఆటగాళ్ల సతీమణులు, ప్రియురాళ్లను బుడగలోకి తీసుకురావాలా లేదంటే ఇప్పుడున్న కరోనా ప్రొటోకాల్ పరిస్థితుల్లో అనుమతి నిరాకరించాలా అన్న అంశంపై బోర్డు తర్జనభర్జన పడుతోంది. దీనిపై ఫ్రాంచైజీల నుంచి భిన్నవాదనలు వచ్చినట్లు తెలిసింది.
కొన్ని ఫ్రాంచైజీలేమో అసలే బయటి ప్రపంచంతో సంబంధం లేనట్లుగా గప్చుప్గా (ప్రేక్షకుల్లేకుండా) జరిగే ఈవెంట్ కాబట్టి... ఆటగాళ్లతో కనీసం కుటుంబసభ్యుల్ని అనుమతించాలని సూచిస్తున్నాయి. ఇతర ఫ్రాంచైజీలేమో వారిని బుడగలోకి తెస్తే... రెండు, మూడేళ్లున్న పిల్లల సంరక్షణ ఎలా? షాపింగ్కని, వేరే చోటుకని బుడగదాటితే ఎదురయ్యే పరిణామాలేంటని వారిస్తున్నాయి. దీనిపై త్వరలోనే బోర్డు నిర్ణయం తీసుకొని స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ను ఎనిమిది ఫ్రాంచైజీలకు జారీచేయనుంది.