Ravindra Jadeja: మా కోడలి వల్లే ఇదంతా... మండిపడ్డ రివాబా! | Asked About Accusations By Jadeja's Father, Rivaba Stern Response Goes Viral | Sakshi
Sakshi News home page

Ravindra Jadeja: మా కోడలి వల్లే ఇదంతా... మండిపడ్డ రివాబా!

Feb 12 2024 10:14 AM | Updated on Feb 12 2024 10:46 AM

Asked About Accusations By Jadeja Father Rivaba Stern Response Viral - Sakshi

Ravindra Jadeja- Rivaba Jadeja: ఆటతోనే కాకుండా వ్యక్తిగత విషయాలతోనూ ఇటీవల వార్తల్లో నిలుస్తున్నాడు టీమిండియా స్టార్‌ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా. పెళ్లైన తర్వాత తన కుమారుడు పూర్తిగా మారిపోయాడని.. అందుకు తమ కోడలు రివాబనే కారణమంటూ జడేజా తండ్రి అనిరుద్‌సిన్హ సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.

సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తూ.. ఎంతో కష్టపడి కొడుకును క్రికెటర్‌ను చేస్తే ఇప్పుడు అతడిని నేరుగా కలిసే అవకాశం కూడా లేకుండా పోయిందంటూ వాపోయాడు. జడేజా ఆస్తిపై రివాబా, ఆమె తల్లిదండ్రుల పెత్తనం ఎక్కువైపోయిందని.. తమ మనవరాలిని కనీసం ఒక్కసారి కూడా చూడనివ్వలేదని అనిరుద్‌సిన్హ జడేజా ఆరోపించాడు.

ఈ విషయంపై స్పందించిన రవీంద్ర జడేజా.. తన తండ్రి ఆరోపణలు అర్థంలేనివని కొట్టిపారేశాడు. ఉద్దేశపూర్వకంగా ఇలాంటి ఇంటర్వ్యూలను ప్లాన్‌ చేయడాన్ని ఖండిస్తున్నానని.. ఇరువర్గాలను సంప్రదించిన తర్వాతే ఇటువంటి వార్తలు ప్రసారం చేస్తే బాగుంటుందని దైనిక్‌ భాస్కర్‌(జాతీయ మీడియా) తీరుపై జడ్డూ మండిపడ్డాడు.

విలేకరి ప్రశ్నపై మండిపడ్డ రివాబా
ఈ నేపథ్యంలో ఓ కార్యక్రమానికి హాజరైన జామ్‌నగర్‌ ఎమ్మెల్యే, జడ్డూ సతీమణి రివాబాకు ఈ విషయం గురించి ప్రశ్న ఎదురైంది. ఇందుకు స్పందిస్తూ.. ‘‘ఈరోజు మనం ఇక్కడ ఎందుకు సమావేశమయ్యామో తెలియదా? 

వ్యక్తిగత విషయాల గురించి అడగాలంటే నేరుగా నన్ను వచ్చి కలవండి.. అంతేగానీ ఇక్కడ ఆ విషయాలు మాట్లాడొద్దు’’ అని రివాబా సదరు విలేకరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా రాజకీయాలపై ఆసక్తి ఉన్న రివాబా సోలంకి జడేజా బీజేపీలో చేరి జామ్‌నగర్‌ ఎమ్మెల్యేగా గెలిచి గుజరాత్‌ అసెంబ్లీలో అడుగుపెట్టారు.

ఎన్నికల ప్రచారంలో జడ్డూ మద్దతు..
ఇక ఎన్నికల ప్రచార సమయంలో రవీంద్ర జడేజా తన భార్య రివాబాకు మద్దతుగా నిలవగా... అతడి తండ్రి అనిరుద్‌సిన్హ, అక్క నైనాబా కాంగ్రెస్‌ తరఫున రివాబాకు వ్యతిరేకంగా ప్రచారం నిర్వహించారు. 

ఇదిలా ఉంటే.. టెస్టుల్లో వరల్డ్‌ నంబర్‌ వన్‌ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా ఇంగ్లండ్‌తో సిరీస్‌తో బిజీగా ఉన్నాడు. తొలి టెస్టు తర్వాత గాయపడిన అతడు.. రెండో మ్యాచ్‌కు దూరమయ్యాడు. ఫిబ్రవరి 15 నుంచి మొదలుకానున్న మూడో టెస్టుకు జడ్డూ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

చదవండి:  ముంబై ఇండియన్స్‌ కోచ్‌పై రితిక ఫైర్‌.. రోహిత్‌ ఫస్ట్‌ రియాక్షన్‌ ఇదే

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement