ప్రతిష్టాత్మకంగా ఏపీ సీఎం కప్ టోర్నమెంట్.. రాష్ట్ర క్రీడా చరిత్రలో గొప్ప కార్యక్రమం | AP CM Cup Tournament Off To Start: RK Roja Inaugurates | Sakshi
Sakshi News home page

AP CM Cup: ప్రతిష్టాత్మకంగా ఏపీ సీఎం కప్ టోర్నమెంట్.. రాష్ట్ర క్రీడా చరిత్రలో గొప్ప కార్యక్రమం

May 2 2023 10:35 AM | Updated on May 2 2023 10:49 AM

AP CM Cup Tournament Off To Start: RK Roja Inaugurates - Sakshi

సాక్షి, తిరుపతి: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఏపీ సీఎం కప్ టోర్నమెంట్ ఫైనల్స్‌ తిరుపతి జిల్లాలో జరగడం పట్ల ఎంతో సంతోషిస్తున్నామని క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి ఆర్కే రోజా హర్షం వ్యక్తం చేశారు. స్థానిక ఎస్వీ యూనివర్సిటీ స్టేడియంలో ఆంధ్ర ప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి ఏపీ సీఎం కప్ టోర్నమెంట్‌ను ఆరంభించారు. తిరుపతిలో మే 1- 05 వరకు ఈ టోర్నీ జరుగనుంది.

పురుషులు, మహిళల కోసం 14 విభాగాలలో ఈ టోర్నీ నిర్వహిస్తున్న నేపథ్యంలో మంత్రి ఆర్కే రోజా, శ్యాప్ చైర్మన్ సిద్ధార్థ రెడ్డి, యువజన సర్వీసులు ప్రధాన కార్యదర్శి, వాణీ మోహన్, జిల్లా కలెక్టర్ కె.వెంకట రమణ రెడ్డి, శ్యాప్ వీసీ అండ్ ఎండీ హర్ష వర్ధన్, శ్యాప్ డైరెక్టర్లతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి పోటీలను ఘనంగా ప్రారంభించారు. అనంతపురం జిల్లా మొదలు 13 ఉమ్మడి జిల్లాల క్రీడాకారులు మార్చ్ ఫాస్ట్  నిర్వహించగా మంత్రి గౌరవ వందనం స్వీకరించారు.

కోటి 40 లక్షల రూపాయలు కేటాయించి
ఈ సందర్భంగా.. మంత్రి రోజా మాట్లాడుతూ రాష్ట్ర క్రీడా చరిత్రలో ఇంత పెద్ద ఎత్తున క్రీడా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరగలేదని, ఇదొక గొప్ప కార్యక్రమం అన్నారు. సుమారు 4900 మంది మహిళా, పురుష క్రీడాకారులు ఈ ఈవెంట్లో పాల్గొంటున్నారని తెలిపారు.

క్రీడలలో గెలిచేందుకు పోటీ పడాలని, అయితే, మెడల్ సాధించలేక పోయినా నిరాశ చెందాల్సిన పనిలేదని ఆమె క్రీడాకారులకు పిలుపునిచ్చారు. మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయి క్రీడల పోటీలలో గెలుపొంది ప్రస్తుతం రాష్ట్రస్థాయి సీఎం కప్ పోటీలలో పాల్గొనే అర్హతతో ఇక్కడికి వచ్చారని..  ఇప్పటికే అందరూ సగం గెలిచారని, గెలుపు ఓటములు సహజమని ఓడినవారు బాధపడాల్సిన అవసరం లేదని స్పూర్తి నింపారు.

రాష్ట్రస్థాయి ఏపీ సీఎం కప్ క్రీడలకు కోటి 40 లక్షల రూపాయలు కేటాయించి ప్రతిష్టాత్మకంగా టోర్నీని నిర్వహిస్తున్నామని మంత్రి రోజా తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా క్రీడాకారులను ప్రోత్సహిస్తూ, సహకారం అందిస్తుందని, వారు జాతీయ, అంతర్జాతీయ స్థాయికి క్రీడాకారులు గా ఎదుగుటకు తోడ్పాటు ఉంటుందని అన్నారు. క్రీడలలో పాల్గొంటున్న క్రీడాకారులకు ఆల్ ది బెస్ట్ తెలిపి ఏపీ సిఎం కప్ 2023 డిక్లరేషన్‌తో  క్రీడలను ప్రారంభించారు.

క్రీడాకారుల కోసం
ఇక శ్యాప్ చైర్మన్ బైరెడ్డి సిద్దార్థ రెడ్డి మాట్లాడుతూ..  ‘‘13 ఉమ్మడి జిల్లాల క్రీడాకారులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉంది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రోత్సహంతో సంక్రాంతి సంబరాలు, జగనన్న క్రీడా సంబరాలు తదితర క్రీడా కార్యక్రమాలు నిర్వహించి ప్రైజ్ మనీ అందించాం.

క్రీడాకారులు కూడా అభివృద్ధి చెందాలని ఈ ప్రభుత్వంలో వివిధ క్రీడాకారులకు 2500 మందికి స్పోర్ట్స్ కోటా కింద ఉద్యోగ అవకాశాలు కల్పించాం’’ అని తెలిపారు. జీవితం చాలా చిన్నదని, సంతోషంగా ఉండాలని, స్నేహితులతో సంతోషంగా గడపాలని  టోర్నమెంట్లో పాల్గొనే అందరు క్రీడాకారులకు ఆల్ ది బెస్ట్ చెప్పారు.

ఈ కార్యక్రమంలో స్మార్ట్ సిటీ జీఎం చంద్రమౌళి, ఎస్.ఈ ఆర్డబ్ల్యూఎస్ విజయకుమార్, సిఈఓ సేట్విన్ మురళి కృష్ణ రెడ్డి, పిడిడిఆర్డిఏ  జ్యోతి, చీఫ్ కోచ్ సయ్యద్ హుస్సేన్, డిఎంహెచ్ఓ శ్రీహరి, జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి బాల కొండయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement