కలెక్టర్ హైమావతి
సిద్దిపేటరూరల్: పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యతని దీనిపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్ హైమావతి పేర్కొన్నారు. కలెక్టరేట్లో తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి రూపొందించిన పర్యావరణాన్ని పరిరక్షణకు సంబంధించిన పోస్టర్ను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ...ప్లాస్టర్ ఆఫ్ పారిస్తో చేసిన వినాయకులను పూజించడం వల్ల చెరువులు, కాలువలు కలుషితమవుతున్నాయని ఈ క్రమంలో మట్టి గణపతిని పూజించి పర్యావరణాన్ని పరిరక్షించాలన్నారు. ప్లాస్టిక్ కాలుష్యాన్ని తగ్గించడానికి ప్రతీ ఒక్కరు కృషి చేయాలన్నారు.
కలెక్టర్ చేతుల మీదుగా అధికారిక దత్తత
కలెక్టరేట్లో జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో తొమ్మిదేళ్ల బాలుడిని కరీంనగర్ జిల్లాకు చెందిన సింగిల్ పేరెంట్ మహిళకు కలెక్టర్ చేతుల మీదుగా అధికారికంగా దత్తత అందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ...బాబును బాగా చదివించాలని, అతడికి ఇష్టమైన రంగంలో ప్రోత్సాహమిస్తూ బాలుడి బంగారు భవిష్యత్కు బాటలు వేయాలన్నారు. జిల్లావ్యాప్తంగా పిల్లలు లేని దంపతులు దత్తత తీసుకోవాలనుకుంటే సిద్దిపేటలో గల శిశు గృహ, జిల్లా బాలల పరిరక్షణ విభాగం ద్వారా అధికారికంగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
ప్రజావాణికి 70 దరఖాస్తులు
కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణికి ప్రజల నుంచి 70 దరఖాస్తులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి తమ సమస్యల పరిష్కారం కోసం ప్రజలు అందించిన అర్జీలను కలెక్టర్ హైమావతి స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆయా శాఖల్లో ప్రజావాణి పెండింగ్ దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలన్నారు. కాగా, ప్రజావాణి కార్యక్రమానికి పలువురు జిల్లా అధికారులు ఆలస్యంగా హాజరుకావడంతో విషయాన్ని గమనించిన కలెక్టర్ హైమావతి సదరు జిల్లా అధికారులను ప్రజావాణి కార్యాలయం లోపలికి అనుమతించలేదు. దీంతో కొద్ది సేపు అదికారులు బయటనే వేచి ఉన్నారు.


