
కాంగ్రెస్ కుట్రలు తిప్పికొడతాం
● అపర భగీరథుడు కేసీఆర్ ● దుబ్బాక ఎమ్మెల్యే ప్రభాకర్రెడ్డి ● మల్లన్న సాగర్ వద్ద మహాధర్నా ● కేసీఆర్, హరీశ్రావుల ఫ్లెక్సీకి జలాభిషేకం
తొగుట(దుబ్బాక): గోదావరి జలాలతో తెలంగాణను సస్యశ్యామలం చేసిన కేసీఆర్పై కాంగ్రెస్ సర్కార్ ఎన్నికుట్రలు చేసినా ప్రజలు తిప్పికొడతారని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. కేసీఆర్కు మద్దతుగా మల్లన్న సాగర్ వద్ద బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి బుధవారం భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కట్టపై బైఠాయించి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ప్రభాకర్రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్, హరీశ్రావులపై కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రపూరితంగానే సీబీఐ కేసు పెట్టారని ఆరోపించారు. మేడిగడ్డ ప్రాజెక్టులో కేవలం రెండు పిల్లర్లు కూలితే రూ.లక్ష కోట్ల అవినీతి జరిగిందని కాంగ్రెస్ ప్రచారం చేయడం సిగ్గుచేటన్నారు. మల్లన్న సాగర్ నుంచి మెదక్, సిరిసిల్లా, నల్గొండ జిల్లాల్లో పంటలకు సాగునీరు అందుతున్నది వాస్తవం కాదా అన్నారు. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డికి ప్రాజెక్టులపై అవగాహన లేదన్నారు. రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్లకు గోదావరి జలాలు పొంగిపొర్లుతుంటే కాంగ్రెస్ నాయకులకు కళ్లకు కనిపించడంలేదా అని నిలదీశారు. కుంగిన మేడిగడ్డ పిల్లర్లకు మరమ్మతు చేయాలని ఎన్డీఏఎస్ రిపోర్టు ఇస్తే రేవంత్ సర్కార్ రిపోర్టును బుట్టదాఖలు చేసిందని ఆరోపించారు. ప్రాజెక్టులు నిర్మించి సాగునీరు అందించిన కేసీఆర్కు ప్రజల్లో ఉన్న ఆదరణచూసి ఓర్వలేకనే రేవంత్ సర్కార్ సీబీఐ కేసు పేరుతో వేధింపులకు పాల్పడుతోందని ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్కు తగిన బుద్ధిచెబుతారని ఆయన అన్నారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులతో కలిసి కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్రావుల ఫ్లెక్సీకి జలాభిషేకం చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు మనోహర్రావు, సతీష్రెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు జీడిపల్లి రాంరెడ్డి, నియోజకవర్గంలోని మాజీ ప్రజా ప్రతినిధులు, ఎఎంసీ చైర్మన్లు పాల్గొన్నారు.
రాజకీయ కుట్రలో భాగమే..
ఎమ్మెల్సీ దేశపతి ఆరోపణ
సిద్దిపేటజోన్: రాజకీయ కుట్రలో భాగంగానే కాళేశ్వరం ప్రాజెక్టు అంశాన్ని సీబీఐకి అప్పగించాలని చూస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ ఆరోపించారు. బుధవారం జిల్లా కేంద్రంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టు అంటే ఒక మెడిగడ్డ కాదని, 20 రిజర్వాయర్ల సమూహమేనన్నారు. కేసీఆర్, హరీశ్రావు, ఇంజినీరింగ్ అధికారులు కష్టపడి రైతన్నల ముంగిట్లో సాగునీరు తెచ్చారని అన్నారు.

కాంగ్రెస్ కుట్రలు తిప్పికొడతాం