
ఆయిల్పామ్ ఫ్యాక్టరీ పనులు వేగిరం చేయండి
● కలెక్టర్ హైమావతి ● సీఎం సభ ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష
పరిశుభ్రతతోనే నులి పురుగులు దూరం
ఆస్పత్రుల్లో బయోమెట్రిక్ అమలు చేయండి
నంగునూరు(సిద్దిపేట): ఆయిల్పామ్ ఫ్యాక్టరీని ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభించేందుకు త్వరగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ హైమావతి అధికారులను ఆదేశించారు. నంగునూరు మండలం నర్మేటలో ఆయిల్పామ్ ఫ్యాక్టరీని సోమవారం కలెక్టర్ సందర్శించి నిర్మాణం పనులపై ఆరా తీశారు. వీఐపీలు వస్తున్నందున ప్రారంభోత్సవానికి పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలన్నారు. బీటీ రోడ్డు పనులు, డ్రైనేజీ వ్యవస్థను పటిష్ట పరచాలని ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు. సభకు భారీ సంఖ్యలో తరలి వచ్చే రైతులకు ఇబ్బందులు కలగకుండా వసతులు కల్పించాలన్నారు. పార్కింగ్, సభా స్థలం, తాత్కాలిక హెలీప్యాడ్ సిద్ధం చేయాలని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా ఉద్యాన అధికారి సువర్ణ, ఆయిల్ఫెడ్ మేనేజర్ సుధాకర్రెడ్డి, శ్రీకాంత్రెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి స్వరూపరాణి, పీఆర్ ఈఈ శ్రీనివాస్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కొండపాక(గజ్వేల్): పరిశుభ్రతతోనే నులి పురుగులను దూరం చేయవచ్చని కలెక్టర్ హైమావతి అన్నారు. కొండపాకలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో సోమవారం విద్యార్థులకు నులిపురుగుల నివారణ కోసం ఆల్బెండజోల్ మాత్రలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా హైమావతి మాట్లాడుతూ జీర్ణక్రియ వ్యవస్థ మెరుగుపడటానికి ఆల్బెండజోల్ మాత్రలు దోహదపడతాయని కలెక్టర్ అన్నారు. ముఖ్యంగా వర్షాకాలంలో ఎక్కువ శాతంగా ఇలాంటి నులిపురుగులు ఉత్పత్తి అవుతాయన్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ఆహారాన్ని తీసుకునే ముందు చేతులను సబ్బుతో శుభ్రం చేసుకోవాలన్నారు. ప్రతి విద్యార్థి ఆల్బెండజోల్ మాత్రలు వేసుకునేలా ఉపాధ్యాయులు చొరవచూపాలన్నారు. కార్యక్రమంలో డీఎంహెచ్ఓ ధన్రాజ్, డీఈఓ శ్రీనివాస్రెడ్డి, డిప్యూటీ డీఎంహెచ్ఓలు, వైద్య సిబ్బంది, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
91శాతం పంపిణీ పూర్తి
సిద్దిపేటకమాన్: నులిపురుగుల నిర్మూలన కార్యక్రమంలో భాగంగా జిల్లాలో సోమవారం ఆల్బెండజోల్ మాత్రల పంపిణీ 91.2శాతం పూర్తయినట్లు డీఎంహెచ్ఓ ధనరాజ్ తెలిపారు. జిల్లాలో 2.,29,361 మంది చిన్నారులు ఉండగా 2,09,370మందికి మాత్రలు వేయించినట్లు ఆయన తెలిపారు. పిల్లలందరికీ వేయించాలని ఆయన సిబ్బందికి సూచించారు.
సిద్దిపేటరూరల్: జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రులలో బయోమెట్రిక్ ద్వారా హాజరు అమలు చేయాలని కలెక్టర్ హేమావతి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించి ప్రజావాణి అర్జీలపై పురోగతి, ఇతర అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇకపై అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో బయోమెట్రిక్ హాజరు విధానం ప్రవేశపెట్టి నిర్ణీత సమయం ప్రకారం వైద్యులు , వైద్య సిబ్బంది విధులకు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని డీఎంహెచ్ఓను ఆదేశించారు.
22 లక్షల మొక్కలు నాటాలి
వన మహోత్సవంలో జిల్లాకు నిర్దేశించిన 22 లక్షల మొక్కలను నాటేందుకు శాఖల వారిగా కేటాయించిన లక్ష్యాలను వారం రోజుల్లోగా పూర్తి చేయాలన్నారు. అనుమతులు లేకుండా ఏర్పాటు చేసే వాటర్ ప్లాంట్స్ పై చర్యలు తీసుకోవాలని సూచించారు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలన్నారు.

ఆయిల్పామ్ ఫ్యాక్టరీ పనులు వేగిరం చేయండి