
ముంచెత్తిన వాన..
మంగళవారం శ్రీ 22 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025
జిల్లాలో అకాల వర్షం తీరని నష్టాన్ని కలిగించింది. సోమవారం సాయంత్రం పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. పలు కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం బస్తాలు తడిసిముద్దయ్యాయి. హుస్నాబాద్ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో ఆరబెట్టిన ధాన్యం పూర్తిగా తడిసి పోయింది. కాంటా కోసం ధాన్యం ఆరబెట్టి, తాలు లేకుండా శుభ్రం చేసుకున్నారు. ఒక్కసారిగా కురిసిన వర్షంతో ధాన్యమంతా నీటిపాలైంది. మార్కెట్లోకి వరద వస్తే బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. వరద ఎక్కడికక్కడా నిలిచిపోవడంతో ధాన్యమంతా నీటిలో మునిగిపోయింది. మునిగిన ధాన్యాన్ని గంపల్లో ఎత్తుకుంటూ రైతులు అవస్థలు పడ్డారు. కాంటా పెట్టిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు మిల్లులకు తరలించకపోవడంతో ధాన్యం బస్తాలు సైతం తడిసిపోయాయి. పది రోజుల నుంచి పడిగాపులు కాసి ధాన్యానికి కాపలాగా ఉంటే ఒక్కసారిగా కురిసిన వర్షంతో ధాన్యమంతా నీటి పాలైందని రైతులు కన్నీటిపర్యంతమయ్యారు. అలాగే జగదేవ్పూర్ మండలంలో ఈదురు గాలులు, వడగళ్లతో వర్షం కురిసింది. చెట్లు నేలకొరిగాయి. హోల్సెల్ చెప్పుల దుకాణం పైకప్పు రేకులు ఎగిరిపడ్డాయి. అలాగే నిరుపేదకు చెందిన పూరి గుడిసె ధ్వంసమైంది. పలు గ్రామాల్లో వరి పంటకు నష్టం జరిగింది. మామిడి తోటల్లో మామిడి కాయలు నేలరాలాయి. మద్దూరు మండల కేంద్రంతో పాటు జాలపల్లి, తోర్నాల, లింగాపూర్ గ్రామాల్లో ఉరుములు, మెరుపులులతో వర్షం కురిసింది. గాలి దుమారానికి పలుచోట్ల విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలకూలగా, పలు ఇళ్లు ధ్వంసమయ్యాయి.
–హుస్నాబాద్/మద్దూరు/జగదేవ్పూర్(గజ్వేల్)
వరదనీటిలో ధాన్యం.. రైతన్న శోకం
అకాల వర్షంతో తీరని నష్టం నోటికాడికూడు వర్షార్పణం