
పెండింగ్ పనులు పూర్తి చేయించండి
మంత్రి దామోదరకు వినతి
ప్రశాంత్నగర్(సిద్దిపేట): జిల్లాలో పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయించేలా చొరవ చూపాలంటూ మంత్రి దామోదర రాజనర్సింహను కోరినట్లు పీసీసీ సభ్యుడు దరిపల్లి చంద్రం తెలిపారు. బుధవారం హైదరాబాద్లోని మంత్రి రాజనర్సింహ నివాసంలో మర్యదపూర్వకంగా కలిసినట్లు ఆయన తెలిపారు. జిల్లాలో ఉన్న సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లగా, అందుకు మంత్రి సానుకూలంగా స్పందించారన్నారు. అలాగే పార్టీ కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికీ తగిన గుర్తింపు ఉంటుందని మంత్రి తెలిపారన్నారు. జిల్లా అభివృద్ధికి పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసిమెలసి ముందుకు సాగాలని మంత్రి తెలిపారన్నారు.
బాధిత కుటుంబాలకు అండ
గజ్వేల్: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన బాధిత కుటుంబాలకు గజ్వేల్ ప్రాంతంలోని ఉపాధ్యాయులు అండగా నిలిచారు. మెదక్ జిల్లా చేగుంట మండలం మక్కరాజ్పేట స్కూల్ కాంప్లెక్స్లో సీఆర్పీలుగా విధులు నిర్వహిస్తున్న రమేశ్నాయక్, శ్రీనివాస్ల ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురైన మృతిచెందారు. ఉపాధ్యాయులు రూ.1.90లక్షలు సేకరించి ఫిక్స్డ్ డిపాజిట్ రూపంలో బాధిత కుటుంబాలకు బుధవారం అందించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయ సంఘాల నాయకులు శశిధర్శర్మ, మల్లికార్జున్, నరేందర్, శ్రీధర్రెడ్డి, శ్రీనివాస్రావు, అమర్నాథరావు, రమణరావు, నరసింహ, సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు దుండిగల్ యాదగిరి తదితరులు పాల్గొన్నారు.
సేంద్రియ ఎరువులను
ప్రోత్సహిద్దాం
మున్సిపల్ కమిషనర్ ఆశ్రిత్ కుమార్
సిద్దిపేటజోన్: సేంద్రియ ఎరువుల తయారీని ప్రోత్సహించడానికి మున్సిపల్ ప్రత్యేక చర్యలు చేపట్టిందని మున్సిపల్ కమిషనర్ ఆశ్రిత్ కుమార్ అన్నారు. బుధవారం ఆయన పట్టణంలోని పలు వార్డుల్లో క్షేత్ర స్థాయిలో పర్యటించారు. మంగమ్మతోటలో మురికి కాలువల్లో పేరుకుపోయిన చెత్త చెదారం, సిల్ట్ తొలగించే పనులను పరిశీలించారు. ఆయా వార్డుల్లో వేసవిలో రాలుతున్న ఎండు ఆకులను చూసి వీటిని సేంద్రియ ఎరువుల తయారీకి వాడాలని, కంపోస్టు యార్డుకు తరలించాలని సిబ్బందికి సూచించారు. 27 వార్డులో యూజీడి సమస్యలు పరిష్కరించాలని ప్రజలు కమిషనర్కు వివరించారు. ఆయన వెంట కౌన్సిలర్లు నాగరాజురెడ్డి, శ్రీనివాస్ పాల్గొన్నారు.
నీట్ పరీక్ష కోసం కసరత్తు
పలు పాఠశాలలను పరిశీలించిన కలెక్టర్
ప్రశాంత్నగర్(సిద్దిపేట): నీట్ పరీక్షల నిర్వహణకు జిల్లా అధికారులు కసరత్తు చేస్తున్నారు. మే 4న పరీక్ష నిర్వహించనున్న దృష్ట్యా కేంద్రాల కోసం పట్టణంలోని పలు పాఠశాలల్లో మౌలిక వసతులను కలెక్టర్ మనుచౌదరి బుధవారం పరిశీలించారు. నేషనల్ టెస్టింగ్ కమిటీ మార్గదర్శకాల ప్రకారం పరీక్ష కేంద్రాలలో గదుల సంఖ్య, పార్కింగ్ సౌకర్యం, విద్యుత్ సరఫరా, ఫర్నిచర్లు ఉన్నాయా? లేదా? అని ఆరా తీశారు. నీట్ పరీక్ష నిర్వహణకు పట్టణంలో మూడు పరీక్ష కేంద్రాలను ఎంపిక చేయనున్నారు. కలెక్టర్ వెంట డీఈఓ శ్రీనివాస్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

పెండింగ్ పనులు పూర్తి చేయించండి