ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తాం
సిద్దిపేటఅర్బన్: కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించేందుకే యాత్ర చేపట్టామని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు విజ్జు కృష్ణన్ అన్నారు. సీపీఎం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రజా చైతన్య యాత్ర సోమవారం సిద్దిపేటకు చేరుకుంది. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. 2014 ఎన్నికలకు ముందు మోదీ ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి నెరవేరలేదని అన్నారు. ఏటా రెండు కోట్ల మందికి ఉద్యోగాలు ఇస్తామని కబుర్లు చెప్పారని, ఇప్పటివరకు ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారో తెలపాలని డిమాండ్ చేశారు. ఇష్టారీతిన ధరలు పెంచుతూ సామాన్యులపై భారం మోపుతున్నారని, కార్పొరేట్ శక్తులకు పెద్దపీట వేస్తున్నారని విమర్శించారు. అధికారం కోసం కాదని, ప్రజా సమస్యల పరిష్కారం కోసమే సీపీఐ యాత్రలు చేస్తోందని అన్నారు. ఏప్రిల్ 5న కార్మిక, కర్షక సమస్యల పరిష్కారం కోసం ఢిల్లీలో మహా ర్యాలీని నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. సమావేశంలో సీపీఐ జిల్లా కమిటీ సభ్యులు లక్ష్మణ్, శంకర్, జనార్దన్, రెవల్యూషనరీ పార్టీ ఉమ్మడి జిల్లా ఇన్చార్జ్ మన్నె కుమార్ సంఘీభావం తెలిపారు. యాత్రలో భాగంగా ప్రజానాట్యమండలి కళాకారుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు వీరయ్య, సభ్యులు ఆశయ్య, స్కైలాబ్ బాబు, జగదీష్, బాలకృష్ణ, జయలక్ష్మి, సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లారెడ్డి, నాయకులు యాదవ రెడ్డి, కళావతి, గోపాలస్వామి, శశిధర్, రవీందర్, అరవింద్, జన చైతన్య యాత్ర రూట్ ఇన్చార్జ్ వెంకటేష్, వెంకట్, శోభన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు విజ్జు కృష్ణన్