బీఆర్ఎస్, బీజేపీ నాయకుల మధ్య తోపులాట
మిరుదొడ్డి(దుబ్బాక): నూతనంగా నిర్మించిన పంచాయతీ భవన ప్రారంబోత్సవంలో బీఆర్ఎస్, బీజేపీ నాయకుల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. మండల పరిధిలోని ధర్మారం పంచాయతీ భవనాన్ని శుక్రవారం ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ప్రొటోకాల్ పాటించకుండా అభివృద్ధి పనులను ఎలా ప్రారంభిస్తారంటూ ఆయనను బీజేపీ నాయకులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో ప్రారంభోత్సవం రసాబాసాగా మారింది. అధికారిక అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే రఘునందన్రావుకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఎలా ప్రారంభిస్తారని బీజేపీ నాయకులు ప్రశ్నిస్తూ బీజేపీ నాయకులు ఆందోళనకు దిగారు. దీంతో బీఆర్ఎస్ నాయకులు బీజేపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇరు వర్గాలు పరస్పరం వ్యతిరేక నినాదాలు చేసుకున్నారు. పోలీసులు వాగ్వాదాన్ని ఆపే ప్రయత్నం చేయడంతో తోపులాటకు దారి తీసింది. చివరికి ఇరువర్గాల వారిని పోలీసులు చెల్లాచెదురు చేయడంతో ఆందోళన సద్దుమణిగింది.
పంచాయతీరికార్డుల పరిశీలన
కొమురవెల్లి(సిద్దిపేట): మండలంలోని గురువన్నపేట పంచాయతీని శుక్రవారం డీఎల్పీఓ మల్లికార్జున్రెడ్డి సందర్శించారు.ఈ సందర్బంగా పంచాయతీ రికార్డులను పరిశీలించి గ్రామంలోని సమస్యలను పంచాయతీ కార్యదర్శి సతీశ్ను అడిగి తెలుసుకున్నారు. రికార్డుల నిర్వహణలో పలు సూచనలను చేశారు.