భక్తికి సేవామార్గం
చుట్టూ మంచుకొండలు... ఓ వైపు నది... మరోవైపు లోయ... అడుగు తీసి అడుగు వేయాలంటేనే ఇబ్బంది. తీవ్రమైన చలిలో సాగే కేదార్నాథ్ యాత్రలో తెలుగు రాష్ట్రాల భక్తులకు ఆహారం దొరకడం అంత సులభం కాదు. తెలంగాణ రాష్ట్రం సిద్ధిపేట జిల్లాకు చెందిన కొందరు భక్తులు భక్తికి సేవనే మార్గంగా ఎంచుకుని కేదార్నాథ్కు వచ్చే భక్తులకు ఉచితంగా భోజనం, అల్పాహారం, వసతి అందించాలని సంకల్పించి ‘కేదార్నాథ్ అన్నదాన సేవాసమితి’ పేరుతో మంచుకొండల్లో తెలుగు భోజనం, అల్పాహారం అందిస్తున్నారు. 2015 సంవత్సరంలో సిద్దిపేటకు చెందిన భక్తులు కేదార్నాథ్ యాత్రకు వెళ్లారు.
అక్కడ భోజనం లభించక వారు చాలా ఇబ్బంది పడ్డారు. డబ్బులు పెట్టినా సరైన ఆహారం లభించని పరిస్థితి. దీంతో తాము పడ్డ ఇబ్బందులు మిగతా భక్తులు పడకూడదన్న ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్రం సిద్దిపేట కు చెందిన మిత్రులు కొందరు 31 మంది సభ్యులతో కేదార్నాథ్ సేవా సమితి పేరిట ఉచిత అన్నదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి కేంద్రాల ద్వారా మూడుచోట్ల అన్నదానం అందిస్తున్నారు. అన్నదాన సేవలో సమితి ప్రతినిధులు తమవంతు పాత్ర పోషిస్తూనే రోజూ 10 వేల నుంచి 12వేల మందికి భోజనాన్ని అందిస్తున్నారు. అలాగే దాదాపు 400 మందికి ఉచిత వసతి సైతం ఏర్పాటు చేశారు.
ఆహారం... అందించే వేళలు
తెల్లవారుజాము 4 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకూ జరుగుతున్న ఈ సేవలో ఉదయం 7 నుంచి 11 వరకు అల్పాహారం, మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల వరకు భోజనం అందిస్తారు. సాటి భక్తుల కడుపు నింపడంలోనే తమ ఆనందాన్ని, ఆధ్యాత్మికతను వెతుక్కుంటున్నారు సమితి ప్రతినిధులు.
అన్నదానం... దైవ సంకల్పం
అన్ని దానాలలో అన్నదానం మిన్న. మానవ సేవతో మనిషి జీవితానికి పరిపూర్ణ సార్థకత లభిస్తుంది. సిద్దిపేటకు చెందిన పలువురి సహకారంతో 2019లో కేదార్నాథ్ అన్నదాన సేవా సమితిని ఏర్పాటు చేశాం. దక్షిణ భారతదేశంలోనే తొలి లంగర్ను ఏర్పాటు చేసి తెలుగు రాష్ట్రాల భక్తులతో పాటు ఇతర భక్తులకు భోజనాన్ని అందిస్తున్నాం. మహాపుణ్య క్షేత్రమైన కేదార్నాథ్లో అన్నదానం చేయడం దైవ సంకల్పంగా భావిస్తున్నాం.
– చీకోటి మధుసూదన్, కేదార్నాథ్ అన్నదాన సేవా సమితి అధ్యక్షుడు
– గజవెల్లి షణ్ముఖ రాజు, సాక్షి, సిద్ధిపేట


