మిరుదొడ్డి (దుబ్బాక): సంప్రదాయం పేరిట ఉత్సవాల్లో జరిపిన మేక ‘బలి హరణం’(మేకను గావు పట్టడం) కలకలం రేపింది. మేకను బలిచ్చిన దృశ్యాలను కొందరు సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ అయింది. అమానుషంగా మేకను బలి ఇచ్చారన్న ఫిర్యాదుతో ఈ నెల 12న భూంపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు కాగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఈ ఘటన సిద్దిపేట జిల్లాలో చోటుచేసుకుంది. అక్బర్పేట–భూంపల్లి మండల పరిధిలోని ఖాజీపూర్లో గత నెల ఏప్రిల్ 22 నుంచి, 25వ తేదీ వరకు జరిగిన పెద్దమ్మ బోనాల ఉత్సవాల సందర్భంగా సంప్రదాయం పేరుతో ఒక మేకను బలి ఇచ్చారు. ఉత్సవాల్లో భాగంగా కొందరు మేక కాళ్లను పట్టుకోగా బహిరంగంగా ఒక వ్యక్తి మేకను చంపడానికి పదేపదే మేక మెడను కొరుకుతున్న దృశ్యాలను కొందరు యువకులు ఉత్సాహంతో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న ఈ దృశ్యాలు పీఈటీఏ (పీపుల్ ఫర్ ది ఎథికల్ ట్రీట్మెంట్ ఆఫ్ యానిమల్స్ ఇండియా) సంస్థతో పాటు, ఎస్ఏఎఫ్ఐ (స్ట్రే యానిమల్ ఫౌండేషన్ ఇండియా) వంటి సంస్థల దృష్టికి వెళ్లింది. ఈ నేపధ్యంలో ఆ సంస్థలకు చెందిన గౌతం అనే వ్యక్తి మేక బలిపై సిద్దిపేట పోలీస్ కమిషనర్, భూంపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు.


