పటాన్చెరు టౌన్: ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని రుద్రారం గణేశ్ గడ్డ దేవాలయంలో వినాయక నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా 4వ రోజైన గురువారం స్వామివారిని నీలవర్ణంలో విశేషంగా అలంకరించారు. ఆలయ అర్చకులు సంతోష్ జోషి, జగదీశ్వర్ స్వామి, చంద్రశేఖర్, అయ్యప్ప, సతీష్ల ఆధ్వర్యంలో స్వామివారికి ప్రత్యేక పూజలు, హోమం నిర్వహించారు. అనంతరం భక్తులకు నీలవర్ణ అలంకారంలో దర్శనభాగ్యం కల్పించారు. పూజల కోసం వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ఈఓ లావణ్య, జూనియర్ అసిస్టెంట్ ఈశ్వర్ తెలిపారు.


