ఎస్జీఎఫ్ జిల్లా కార్యదర్శి నాగరాజు
మెదక్ కలెక్టరేట్: జిల్లాలో శుక్రవారం నుంచి పాఠశాల క్రీడా సమాఖ్య (ఎస్జీఎఫ్) క్రీడా పోటీలు జరుగుతాయని జిల్లా కార్యదర్శి నాగరాజు తెలిపారు. గురువారం సమీకృత కలెక్టరేట్లోని క్రీడల శాఖ కార్యాలయం వద్ద వాల్ పోస్టర్ ఆవిష్కరించారు. నాగరాజు మాట్లాడుతూ ఎస్జీఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించే జిల్లా స్థాయి, ఉమ్మడి జిల్లా క్రీడా పోటీలలో క్రీడాకారులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని తెలిపారు. ఈనెల 17వ తేది వరకు జిల్లాలోని 21 మండలాల్లో మండల స్థాయి పోటీలు పూర్తి అయినట్లు చెప్పారు. కబడ్డీ, వాలీబాల్, ఖో–ఖో క్రీడాంశాల్లో ఇప్పటివరకు సుమారు 12,600 మంది బాలబాలికలు పాల్గొన్నట్లు వివరించారు. అనంతరం ఎస్జిఎఫ్ జిల్లాస్థాయి పోటీల షెడ్యూల్ వివరించారు.
ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను..
జిల్లా స్థాయి పోటీలలో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను ఎంపిక చేసి ఉమ్మడి మెదక్ జిల్లా స్థాయి పోటీలకు పంపించనున్నట్లు నాగరాజు తెలిపారు. మెదక్ జిల్లా స్థాయిలో: ఫుట్బాల్, అథ్లెటిక్స్ తదితర క్రీడాంశాల్లో పోటీలు నిర్వహించనున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లా స్థాయిలో: కబడ్డీ, సాఫ్ట్బాల్, టేబుల్ టెన్నిస్, షటిల్ బ్యాడ్మింటన్, బేస్బాల్, రగ్బీ, ఫెన్సింగ్, మార్షల్ ఆర్ట్స్ తదితర క్రీడాంశాల్లో పోటీలు నిర్వహించనున్నారు. క్రీడాకారులకు జిల్లా విద్యాధికారి సహకారంతో మధ్యాహ్న భోజన వసతి ఏర్పాటు చేశారు. పోలీస్, మెడికల్, మున్సిపల్, ప్రభుత్వ జూనియర్ కళాశాల, వెస్లీ ఉన్నత పాఠశాల అధికారుల సహకారం తీసుకుంటున్నామని తెలిపారు. పోటీల నిర్వహణకు సుమారు 65 మంది పీడీలు, పీఈటీల సేవలను వినియోగించుకోనున్నట్లు చెప్పారు. ప్రతిరోజు ఉదయం 9 నుండి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతాయని తెలిపారు. మొదటి రోజు జరిగే అండర్ 17 వాలీబాల్ పోటీలలో 21 మండలాల నుంచి 21 జట్లు, సుమారు 440 మంది బాలబాలికలు పాల్గొంటారని తెలిపారు. ఇందుకోసం 6 వాలీబాల్ కోర్టులు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. జిల్లా స్థాయి, ఉమ్మడి జిల్లా స్థాయి పోటీలను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు నాగరాజు తెలిపారు.


