జహీరాబాద్ టౌన్: సాధారణ, మధ్య తరగతి ప్రజలపై ద్రవ్యోల్బణం తీవ్ర ప్రభావం చూపుతుంది. వంట నూనెల ధరలు ఒక్కసారిగా ఆకాశాన్ని అంటాయి. నెల రోజుల్లోనే లీటర్ నూనైపె ఏకంగా రూ.50 పైగా పెరగడంతో వినియోగదారులు అందోళన చెందుతున్నారు. గత మార్చిలో పెరిగిన ధరలు, ఆ తర్వాత కాస్త తగ్గుముఖం పట్టినప్పటికీ.. ఇప్పుడు మళ్లీ ఒక్కసారిగా పెరిగాయి. దీంతో సామాన్య ప్రజల బడ్జెట్పై తీవ్ర ప్రభావం చూపుతుంది. ప్రస్తుతం మార్కెట్లో వివిధ రకాల వంట నూనెల ధరలు రూ. 150 నుంచి రూ. 270 వరకు పలుకుతున్నాయి. సన్ఫ్లవర్, రైస్బ్రాన్ ఆయిల్, పామాయిల్, వేరుశనగ, సోయా ఆయిల్ నూనెల ధరలు భారీగా పెరిగాయి. ఇప్పటికే బియ్యం, గ్యాస్ సిలిండర్ ధరలు పెరిగి ఇబ్బందులు పడుతున్న సామాన్యులకు, ప్రస్తుతం వంట నూనెల ధరలు కూడా తోడవడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం స్పందించి నిత్యావసరాల ధరలను అదుపులోకి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు.
సామాన్యుడిపై మరో భారం


