మద్దూరు(హుస్నాబాద్): తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో బైరాన్పల్లి మహిళల పోరాటం స్ఫూర్తిదాయకమైనదని ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి పేర్కొన్నారు. అమరులైన వీరవనితలను స్మరించుకుంటూ ఐద్వా రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన స్ఫూర్తియాత్ర మంగళవారం కడవెండిలో ప్రారంభమై సాయంత్రం బైరాన్పల్లికి చేరుకుంది. ఈ సందర్భంగా మల్లు లక్ష్మి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రాంతంలో 1946–51 వరకు జరిగిన పోరాటంలో ఎందరో మహిళలు అమరులయ్యారన్నారు. రజాకార్లు మహిళల వస్త్రాలను తొలగించి శవాల చుట్టూ బతుకమ్మ ఆడించిన ఘటన ఆనాడు జరిగిందన్నారు. మహిళలు చిట్యాల ఐలమ్మ స్ఫూర్తితో వీరవనితల్లాగా ఉద్యమించి నిజాం రజాకారుల గుండెల్లో గుబులు పుట్టించారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో స్ఫూర్తియాత్ర అధ్యక్షురాలు అరుణజ్యోతి, ఉపాధ్యక్షురాలు ఆశాలత, సరళ, పద్మ, రమణ, సిద్దిపేట జిల్లా అధ్యక్షురాలు నవీన, కార్యదర్శి శారద, సహాయ కార్యదర్శి శిరీష పాల్గొన్నారు.
ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి


