పటాన్చెరు టౌన్: వ్యక్తి అదృశ్యమైన ఘటన బీడీఎల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్, కోనసీమ జిల్లా... గంగవరం మండలం సత్యవాడ గ్రామానికి చెందిన తోట ప్రభాకరరావు(40) తన సోదరునికి నర్సరీ పనుల్లో సహాయం చేసేందుకు ఈ నెల 10న ముత్తంగి డివిజన్ పరిధిలోని కర్ధనూర్కు వచ్చాడు. 12వ తేదీన రాత్రి సుమారు 9 గంటలకు సోదరునితో కలిసి భోజనం చేసి నిద్రపోయాడు. అర్ధరాత్రి 12 గంటలకు చూడగా ప్రభాకరరావు కనిపించలేదు. దీంతో చుట్టుపక్కల ప్రాంతాలు, బంధువుల వద్ద వెతికినా ఆచూకీ లభించలేదు. ప్రభాకర రావుకు మతిస్థిమితం సరిగా లేదని, అదృశ్యమయ్యాడని కుటుంబ సభ్యులు సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
నర్సాపూర్లో తల్లీముగ్గురు పిల్లలు..
నర్సాపూర్ రూరల్: తల్లీముగ్గురు పిల్లలు అదృశ్యమయ్యారు. ఈ ఘటన నర్సాపూర్లో మంగళవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల వివరాలు.. నర్సాపూర్ పట్టణానికి చెందిన జమ్లా రవి భార్య మమత(30), పెద్ద కూతురు ప్రవళిక, చిన్న కూతురు ఆరాధ్య, కుమారుడు కార్తీక్ను తీసుకొని తల్లి గారి గ్రామం మూసాపేటకు వెళ్తున్నట్లు 12వ తేదీన సాయంత్రం ఇంట్లో చెప్పి వెళ్లింది. అదే రోజు చేరుకున్నారా లేదా అని తెలుసుకునేందుకు మమతకు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది. మమత తల్లిదండ్రులతో పాటు స్నేహితులు, బంధువుల వద్ద వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు.


