మండలవ్యాప్తంగా జరుగుతున్న పలు అభివృద్ధి పనులపై పర్యవేక్షణ లేనికారణాలతోనే పనులు నిలిచిపోతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఎంపీడీఓ కార్యాలయం ప్రభుత్వ పాఠశాల ఆవరణలో నాలుగు ఇరుకు గదుల్లో కొనసాగుతోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో మరమ్మతులు చేయించి అందులో నెట్టుకొచ్చారు. ప్రతీ సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం సైతం ఎంతో ఇబ్బందుల నడుమ ఎవరికి చెప్పుకోవాలో తెలియక అలా కాలం వెళ్లదీస్తున్నారు. ప్రజావాణికి వచ్చే మండల అధికారులు, ప్రజలు వస్తే కూర్చోబెట్టేందుకు కుర్చీలు, టేబుళ్లు కూడా లేని దుస్థితిలో ఉన్నారు.
ఇరుకు గదుల్లో ఎంపీడీఓ కార్యాలయం
గతేడాది సెప్టెంబర్లో నూతన భవనానికి మంత్రి పొన్నం శంకుస్థాపన
ఏడాది కావస్తున్నా ముందుకు సాగని పనులు
మంత్రి పొన్నం ప్రభాకర్ ఇలాకాలో పలు అభివృద్ధి పనులకు అట్టహాసంగా శంకుస్థాపన చేసినప్పటికీ పనులు మాత్రం ముందుకు సాగడం లేదు. మండల కేంద్రంలోని ‘పోలీస్స్టేషన్ వెనక భాగంలో...ఇందిరమ్మ మోడల్ హౌజ్కు ఆనుకుని ఉన్న సర్వే నంబర్ 387లో సుమారుగా రెండెకరాల ప్రభుత్వ స్థలంలో ‘నూతన ప్రజాపరిషత్ భవనం’నిర్మించేందుకు కేటాయించారు. గతేడాది సెప్టెంబర్లో రూ.1.50కోట్ల వ్యయంతో ఎంపీడీఓ కార్యాలయ భవన నిర్మాణానికి కలెక్టర్తో కలిసి మంత్రి శంకుస్థాపన చేశారు. ఏడాది కావస్తున్నా పునాదులు తీసి బండరాళ్లు అడ్డు వస్తున్నాయని పనులను నిలిపివేశారు.
అక్కన్నపేట(హుస్నాబాద్)
పనులు జరగడం లేదు
స్వయంగా మంత్రి శంకుస్థాపన చేసినా పనులు ముందుకు సాగడం లేదు. ప్రస్తుతం ఎంపీడీఓ కార్యాలయం ఇరుకు గదుల్లో నెట్టుకొస్తున్నారు. త్వరగా నూతన భవనం నిర్మిస్తే సౌకర్యంగా ఉంటుంది. మంత్రి ఇలాకాలోనే ఇలా అభివృద్ధి పనులు ముందుకు సాగడం లేదంటే మాకే బాధేస్తుంది.
–జన్నారపు సంపత్, సర్పంచ్ అక్కన్నపేట గ్రామం


