● అన్నదాతలపైనా దాడి
● పైరుల రక్షణకు తప్పని పాట్లు
● ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకోలు
అడవి పందులు అన్నదాతలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. రాత్రి వేళల్లో పంట పొలాలను తీవ్రంగా పాడు చేస్తున్నాయి. రైతులపై సైతం దాడికి దిగుతున్నాయి. దీంతో పంటలు కాపాడుకునేందుకు రైతులు నానా అవస్థలు పడుతున్నారు – న్యాల్కల్(జహీరాబాద్)
జిల్లాలోని న్యాల్కల్, రాయికోడ్, ఝరాసంగం, జహీరాబాద్, మనూర్, నారాయణఖేడ్, కోహీర్ తదితర మండలాల్లో అడవి పందుల సంచారం ఎక్కువగా ఉంది. ఇవి కర్ణాటక సరిహద్దులో ఉండడం, అక్కడ అడవుల విస్తీర్ణం అధికంగా ఉండడంతో అక్కడ నుంచి పందులు ఎక్కువగా ఇక్కడకు వస్తున్నాయి. ప్రస్తుతం చెరకు, పత్తి, పెసర, మినుము, సోయాబీన్తో పాటు ఇతర పంటలు సాగులో ఉన్నాయి. రాత్రి సమయంలో పంటలను పందులు పాడు చేస్తున్నాయని ఆయా గ్రామాల రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పందుల బారి నుంచి పంటలు కాపాడుకునేందుకు నానా అవస్థలు పడుతున్నారు. పొలాల చుట్టూ పాత చీరలు కట్టడం, ఇనుప తీగలు అమర్చడం, రాత్రి వేళల్లో టపాకాయలు కాల్చడం వంటిని చేస్తున్నారు. ఫలితంగా పందులు బెడద నుంచి కొంత వరకు పంటలను రక్షించుకుంటున్నామని చెబుతున్నారు. ఇన్ని చేసినా పంటలపై పందుల దాడి కొనసాగుతూనే ఉందని వాపోతున్నారు. పందుల గుంపు తిన్నంత తిని మిగితా పంటలను పాడు చేస్తున్నాయని అంటున్నారు. ప్రతి రోజు రాత్రి పొలాల వద్ద కాపలా ఉండాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు చర్యలు తీసుకొని పంట నష్టపోయిన తమకు పరిహరం చెల్లి ంచాలని మండలంలోని ఆయా గ్రామాల రైతులు కోరుతున్నారు.


