మూడు దశాబ్దాలగా జహీరాబాద్ పట్టణ ప్రజలు ఎదుర్కొంటున్న ట్రాఫిక్ ఇబ్బందులకు చెక్ పడనుంది. వారం రోజుల్లో మాస్టర్ ప్లాన్ అమలుకు మున్సిపల్ అధికారులు శ్రీకారం చుట్టనున్నారు. ఇందుకోసం ఇప్పటికే మున్సిపల్ కౌన్సిల్ పలుమార్లు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. తాజాగా చైర్మన్ యూనూస్, కమిషనర్ ప్రభాకర్ అధ్యక్షతన జరిగిన కౌన్సిల్ సమావేశం సైతం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. – జహీరాబాద్
జహీరాబాద్ పట్టణం రోజు రోజుకు విస్తరిస్తున్నా రహదారులు మాత్రం ఆక్రమణలతో కుంచించుకుపోయి రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయి. వారం రోజుల్లో ఎప్పుడైనా రహదారుల విస్తరణ చేపట్టనున్నట్లు అధికారులు ప్రకటించారు. ఇప్పటికే వ్యాపారుల వైపు నుంచి సైతం సమ్మతం లభించింది. దీపావళి వరకు అయినా విస్తరణ పనులను తాత్కాలికంగా వాయిదా వేయాలని, వచ్చిన విన్నపాలను అధికారులతో పాటు మున్సిపల్ కౌన్సిల్ తిరస్కరించింది. పట్టణంలోని భవానీ మందిర్, హనుమాన్ మందిర్ రోడ్డు, లతీఫ్ రోడ్డు, ఆదర్శనగర్, బ్లాక్ రోడ్డు, తహసీల్, మోహన్ థియేటర్ రహదారి, 65వ జాతీయ రహదారులను విస్తరించనున్నారు. పట్టణ ప్రణాళిక అధికారులు గుర్తించిన పలు ఆక్రమణ కట్టడాలను ఈసందర్భంగా తొలగించనున్నారు. 1987 డిసెంబర్ 15న వెలువడిన జహీరాబాద్ మాస్టర్ ప్లాన్ జీఓ 995, తెలంగాణ మున్సిపల్ యాక్ట్ 2019 ప్రకారం రోడ్లను విస్తరించేందుకు గాను అధికారులు నిర్ణయించారు. టౌన్ ప్లానింగ్ సైతం నోటీసులను జారీ చేసింది.
మొదట ఈ రోడ్ల విస్తరణ
మొదటి విడతలో అధికంగా రద్దీగా ఉండే భవానీ మందిర్, హనుమాన్ మందిర్ రహదారులను విస్తరించేందుకు నిర్ణయించారు. ఇప్పటికే ఆయా ప్రాంతాల్లోని వ్యాపారులు, ఇంటి యజమానులతో సమావేశాలు నిర్వహించారు. అన్నివర్గాల నుంచి సమ్మతి లభించినట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఆయా రహదారులను 40 ఫీట్ల వెడల్పుతో విస్తరించనున్నా యి. ఇరువైపులా 5 ఫీట్ల వంతున సెట్ బ్యాక్ ఉండాలని అధికారులు సూచనలు జారీ చేశారు. రహదారులను ఆక్రమించిన దు కాణాలను ఎంత మేర కూల్చి వేయాల్సి ఉంటుందనే విషయమై ఇప్పటికే కొలతలు నిర్వహించి మార్కింగ్ వేశారు. దశలవారీగా గుర్తించిన రోడ్లన్నింటీని విస్తరించనున్నారు. మోహన్ థియేటర్ రోడ్డును 60 ఫీట్లుగా విస్తరించే అవకాశం ఉన్నట్లు సమాచారం.
జహీరాబాద్లో ఆక్రమణల కూల్చివేతకు రంగం సిద్ధం
దశలవారీగా రహదారుల విస్తరణకు మున్సిపల్ కౌన్సిల్ గ్రీన్ సిగ్నల్
మూడు దశాబ్దాల అనంతరం మోక్షం
తీరనున్న ట్రాఫిక్ సమస్య
ఆయా రహదారులపై పలు వ్యాపార సంస్థలు ఉన్నాయి. వ్యాపార సంస్థల ముందు పార్కింగ్ సదుపాయం లేదు. 20 నుంచి 30 ఫీట్ల వెడల్పుతో రహదారులు కుచించుకుపోయాయి. కొనుగోళ్ల నిమిత్తం దుకాణాలకు వెళ్లే ప్రజలు వాహనాలను దుకాణాల ముందే పార్కింగ్ చేస్తుండడంతో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతున్నాయి. పలు సందర్భాల్లో ట్రాఫిక్ స్తంభిస్తోంది. రహదారులను విస్తరించేందుకు మున్సిపల్ శాఖ నిర్ణయించడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


