కొండాపూర్(సంగారెడ్డి): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అసమర్థత విధానాలతో రోజు రోజుకు నిరుద్యోగం పెరిగిపోతుందని డీవైఎఫ్ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటేశ్ అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో నిర్వహించిన జిల్లా 4వ మహాసభకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. దేశ యువతకు ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన మోదీ ప్రభుత్వం 12 ఏళ్లుగా మోసం చేస్తూనే ఉందని ఆరోపించారు. ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ శక్తులకు అప్పగిస్తూ ఉద్యోగ అవకాశాలు తగ్గిస్తుండగా, మరోవైపు నీట్, రైల్వే, బ్యాంకింగ్ వంటి పోటీ పరీక్షల్లో వరుసగా ప్రశ్నపత్రాలు లీకవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖల్లోనే సుమారు 10 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. ఆ పోస్టులను భర్తీ చేయడంతో పాటు నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో జిల్లా కార్యదర్శి అనిల్, నాయకులు జయరాజు, మాణిక్యం, శ్రీకాంత్, ప్రశాంత్, శ్రీకాంత్, బాబురావు, వాణి, రమేశ్, సాయికుమార్, అర్జున్, ప్రజా సంఘాల నాయకులు రాజయ్య, నాగ భూషణం, రాజు, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.


