సంగారెడ్డి జోన్: పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే ప్రతీ ఒక్కరు ప్రణాళికబద్ధంగా చదువుకోవాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ పేర్కొన్నారు. పట్టణంలోని బీసీ స్టడీ సర్కిల్లో పోటీ పరీక్షలకు సంబంధించి ఐదు నెలల ఉచిత ఫౌండేషన్ శిక్షణ కార్యక్రమాన్ని మంగళవారం బీసీ సంక్షేమ అధికారి జగదీశ్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... పోటీ పరీక్షలకు అవసరమైన జ్ఞానాన్ని పెంపొందించుకోవడంతోపాటు ప్రతిరోజూ నిర్ణీత సమయాన్ని కేటాయించాలన్నారు. పట్టుదల, ఆత్మవిశ్వాసంతో చదివితే విజయం సాధించడం సాధ్యమేనన్నారు. జీవితంలో ప్రతీ రంగంలోనూ సమస్యలు, సవాళ్లు ఉంటాయని వాటిని అధిగమిస్తూ ముందుకు సాగాలన్నారు. సమస్యలను చూసి వెనకడుగు వేయకుండా వాటిని అవకాశాలుగా మలుచుకుని సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో స్టడీ సర్కిల్ డైరెక్టర్ ప్రవీణ్, తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ ప్రతీక్ జైన్


