● మధ్యాహ్న భోజనం కూడా..
● అవస్థలు పడ్డ విద్యార్థినులు
న్యాల్కల్(జహీరాబాద్): విద్యార్థినులకు సమయానికి అల్పాహారం, మధ్యాహ్నం భోజనం అందకపోవడంతో ఆకలితో అవస్థలు పడ్డారు. రెండు గంటలకు పైగా ఆలస్యంగా టిఫిన్, మిడ్ డే మీల్స్ అందించడంతో కడుపు మాడ్చుకుని తరగతులకు హాజరైన ఘటన మండల కేంద్రమైన న్యాల్కల్లోని కేజీబీవీలో మంగళవారం చోటు చేసుకుంది. 6వ తరగతి నుంచి ఇంటర్ వరకు గల కేజీబీవీలో 305 మంది విద్యార్థినులు విద్యనభ్యసిస్తున్నారు. కాగా 185 మంది విద్యార్థినులు తరగతులకు హాజరు కాగా మిగిలిన 120 మంది రాఖీ పౌర్ణమి పండుగకు ఇంటికి వెళ్లి తిరిగి రాలేదు. వీరందరికి నిత్యం వంట నలుగురు (కుక్లు) వంట వండుతున్నారు. అందులో ముగ్గురు అనారోగ్యం కారణంగా గైర్హాజరయ్యారు. దీంతో ఉన్న ఒక్క వంట మనిషి వారికి అల్పాహారం, మధ్యాహ్న భోజనం అందిస్తుంది. ఉదయం 8.30 గంటలకు అల్పాహారం అందించాల్సి ఉండగా 11గంటలకు అందించారు. భోజనం మధ్యాహ్నం 1 గంటలకు అందించాల్సి ఉండగా 3 గంటలకు అందించినట్లు విద్యార్థినులు తెలిపారు. ఇదిలా ఉండగా విద్యాలయం ఆవరణలోని బోరు మోటారు కూడా పాడైపోయి నీటి కోసం వంట వండే వారు ఇబ్బందులు పడుతున్నారు. విద్యాలయంలో పని చేస్తున్న ప్రత్యేక అధికారి నియామకం జరగకపోవడం ఉన్న ఉపాధ్యాయులకు అదనపు బాధ్యతలు అప్పగించకపోవడం వల్ల కూడా పలు సమస్యలు ఉత్పన్నమౌతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికై నా అధికారులు చర్యలు తీసుకుని అల్పాహారం, మధ్యాహ్న భోజనం సమయానికి అందించాలని విద్యార్థినులు కోరుతున్నారు.


