హత్నూర ఐకేపీలో డీపీఎం విచారణ
హత్నూర(సంగారెడ్డి): ‘రుణం.. వీఓఏల చేతివాటం’ పేరిట శుక్రవారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి జిల్లా ఐకేపీ అధికారులు స్పందించారు. ఏపీఎం రాజశేఖర్కు మెమో జారీ చేశారు. ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించడంతో డీపీఎం రమేశ్బాబు హత్నూర ఐకేపీ కార్యాలయంలో ఏపీఎం, సీసీలతో సమావేశం నిర్వహించి విచారణ చేపట్టారు. గ్రామాల్లో వీఓఏలు ఎక్కువ రోజులుగా పనిచేయడం వల్ల సీసీలకు సైతం వినకుండా మహిళా సంఘాల రుణాల్లో కొంత మేర డబ్బులు వసూలు చేస్తున్న మాట వాస్తవమేనని డీపీఎం దృష్టికి వచ్చినట్లు తెలిసింది. వీఓఏలు సక్రమంగా పనిచేయకుంటే సీసీలతో పాటు ఏపీఎంపై కూడా చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. విచారణ నివేదికను జిల్లా అధికారులకు అందజేస్తామని డీపీఎం తెలిపారు. కాగా ఇటీవల సాక్షిలో వెలువడుతున్న వరుస కథనాలతో ఉన్నతాధికారుల్లో కదలిక మొదలైంది.


