ఇద్దరు బైండోవర్‌ | - | Sakshi
Sakshi News home page

ఇద్దరు బైండోవర్‌

Aug 12 2026 8:00 AM | Updated on Aug 12 2026 8:00 AM

ఇద్దరు బైండోవర్‌ పశువులు తరలిస్తున్న వాహనం పట్టివేత వేర్వేరు చోట్ల ముగ్గురు అదృశ్యం

రూ.లక్ష చొప్పున జరిమానా

అక్కన్నపేట(హుస్నాబాద్‌): మండలంలోని మైసమ్మ వాగుతండా గ్రామంలో మంగళవారం ఎకై ్సజ్‌ శాఖ అధికారులు తనిఖీలు చేసి దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా అక్రమంగా గుడుంబా విక్రయిస్తున్న అక్కన్నపేటకు చెందిన ఒకరు, మైసమ్మవాగుతండాకు చెందిన ఒకరిని గుర్తించారు. ఎకై ్సజ్‌ శాఖ ఎస్‌ఐ దామోదర్‌ నేతృత్యంలో వారిని తహసీల్దార్‌ సింహాచలం మధుసూదన్‌ ఎదుట హాజరుపరిచి బైండోవర్‌ చేశారు. ఒక్కొక్కరికి రూ.లక్ష చొప్పున జరిమానా విధించినట్లు పేర్కొన్నారు.

ములుగు(గజ్వేల్‌): డీసీఎంలో పశువులను అక్రమంగా తరలిస్తున్న వారిపై ములుగు పోలీసులు కేసు నమోదు చేశారు. ఏఎస్‌ఐ సత్యనారాయణ వివరాల ప్రకారం.. మంగళవారం వంటిమామిడి చెక్‌పోస్టు వద్ద పోలీసులు వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఒక డీసీఎంలో పశువులను తరలిస్తున్నట్లు గుర్తించారు. హైదరాబాద్‌లోని బహుదూర్‌పురకు చెందిన వాహన డ్రైవర్‌ అబ్దుల్‌ ఖలీల్‌, కరీంనగర్‌ జిల్లా మానకొండూరుకు చెందిన మహ్మద్‌ అబ్బాస్‌, ఆయూబ్‌, సోహెల్‌, మోహిన్‌లను విచారించగా ఎలాంటి అనుమతి లేకుండా పశువులను రవాణా చేస్తున్నట్లు వెల్లడైంంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, పశువులను గోశాలకు తరలించామని ఏఎస్‌ఐ తెలిపారు.

పటాన్‌చెరు టౌన్‌: తొమ్మిదో తరగతి విద్యార్థి అదృశ్యమయ్యాడు. ఈ సంఘటన పటాన్‌చెరు పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. జేపీ కాలనీ డివిజన్‌ పరిధిలోని రోడ్‌ నం.5కి చెందిన శ్రీరాములు కుమారుడు వరుణ్‌ (13) మంగళవారం స్కూల్‌కి వెళ్తున్నానని చెప్పి వెళ్లలేదు. దీంతో కుటుంబ సభ్యులు తెలిసిన వారి వద్ద, స్థానికంగా వెతికినా ఆచూకీ లభించలేదు. తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

పనికి వెళ్లిన మహిళ..

పటాన్‌చెరు టౌన్‌: పనికి వెళ్తున్నానని చెప్పి వెళ్లిన మహిళ ఆదృశ్యమైంది. ఈ సంఘటన పటాన్‌చెరు పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. ఇస్నాపూర్‌ మున్సిపల్‌ పరిధిలోని ఓడీఎఫ్‌ కాలనీలో నివాసం ఉంటున్న రెడ్డియ భార్య మంజుల(34) కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తుంది. ఈ క్రమంలో ఈనెల 1న సాయంత్రం భర్త మద్యం తాగి ఇంటికి రావడంతో గొడవ జరిగింది. మరుసటి రోజు ఉదయం పనికి వెళుతున్నానని ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. దీంతో ఆమె కోసం వెతికినా ఆచూకీ లభ్యం కాలేదు. పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు.

సంగారెడ్డి పట్టణంలో వృద్ధుడు..

సంగారెడ్డి క్రైమ్‌: వృద్ధుడు అదృశ్యమైన సంఘటన సంగారెడ్డి పట్టణ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ రామునాయుడు వివరాల పకారం.. జహీరాబాద్‌ మండలం గోవిందపురం గ్రామానికి చెందిన గంగరపు అడివయ్య(76), పట్టణంలోని శివాజీనగర్‌లో నివాసం ఉంటున్న తన కుమారుడు చంద్రన్న ఇంటికి ఈనెల 8న వచ్చాడు. అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స కోసం అదే రోజు ఉదయం కుమారుడితో కలిసి సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లొచ్చారు. సాయంత్రం ఇంటి నుంచి వెళ్లిన వృద్ధుడు తిరిగి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు స్థానికులు, బంధువుల వద్ద వెతికినా ఆచూకీ లభ్యం కాలేదు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement