గీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు ఆశన్న గౌడ్
హత్నూర(సంగారెడ్డి): కల్లుగీత కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఈనెల 13న రాష్ట్ర బస్సుయాత్ర మండలంలోని దౌల్తాబాద్లోకి రానున్నదని, ఈ యాత్రను దిగ్విజయం చేయాలని కల్లుగీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు ఆశన్న గౌడ్ పిలుపునిచ్చారు. ఆదివారం మండలంలోని దౌల్తాబాద్లో గీతన్నల చైతన్య యాత్ర వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రధాన కార్యదర్శి రమేశ్ గౌడ్తో కలిసి ఆశన్న గౌడ్ మాట్లాడుతూ.. ప్రభుత్వం గీత కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. బస్సు యాత్ర 13న దౌల్తాబాద్కు, అక్కడి నుంచి సంగారెడ్డికి చేరుతుందన్నారు. ఈ సందర్భంగా కల్లు గీత కార్మిక సంఘం సంగారెడ్డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ, బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు వెంకటేశం గౌడ్, గౌడ జన హక్కుల పోరాట సమితి ఉమ్మడి మెదక్ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజా గౌడ్, మండల నాయకులు ప్రభు గౌడ్, శేఖర్ గౌడ్, లక్ష్మణ్ గౌడ్, చంద్రం గౌడ్, రాజా గౌడ్ తదితరులు పాల్గొన్నారు.


