అక్కన్నపేట(హుస్నాబాద్): ఓ వ్యవసాయ బావి వద్ద విద్యుత్ వైర్లు చోరీకి గురయ్యాయి. ఈ సంఘటన మండల ంలోని రామవరం గ్రామంలో ఆదివా రం చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన రైతు ఎడబోయిన గన్నారెడ్డి కౌలుకు తీసుకొని సాగు చేస్తున్న బావి వద్ద దొంగలు పడ్డారు. బోరు బావి వద్ద ఉన్న స్టార్టర్ వైర్, పీజును కట్ చేసి సుమారుగా 30మీటర్లకుపైగా విద్యుత్ వైర్లను దొంగలు ఎత్తుకెళ్లారు. దీంతో వ్యవసాయ పనులకు తీవ్ర అంతరాయం ఏర్పడిందని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు.
సదాశివపేట రూరల్ (సంగారెడ్డి): ప్రమాదవశాత్తు చెరువులో పడి యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన మండలంలోని మాచిరెడ్డిపల్లి శివారులోని గల్లా చెరువులో ఆదివారం చోటు చేసుకుంది. సదాశివపేట సీఐ వెంకటేశ్, గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు.. మాచిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన బేగారి మహేశ్ కుమార్ (25) కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఉదయం గల్లా చెరువులో మృతదేహం తేలి కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. వారు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని వెలికి తీశారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
చికిత్స పొందుతూ వ్యక్తి..
గజ్వేల్రూరల్: రోడ్డు ప్రమాదంలో గాయాలైన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ సంఘటన మండలంలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాలు.. మండల పరిధిలోని బూర్గుపల్లికి చెందిన జెగ్గం మహేందర్(30) గ్యాస్ స్టౌవ్ రిపేర్ చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. ఈనెల 6న వర్గల్ నుంచి గజ్వేల్ వైపు ద్విచక్ర వాహనంపై వస్తున్నాడు. ఈ క్రమంలో మార్గమధ్యలోని సంగాపూర్ మసీద్ వద్దకు రాగానే వర్షం వస్తుండడంతో రోడ్డుపై బైక్ అదుపుతప్పింది. దీంతో కిందపడడంతో తలకు గాయాలయ్యాయి. వెనకే వచ్చిన సమీప బంధువైన గుంటుపల్లి బాబు కిందపడి ఉన్న మహేందర్ను గుర్తించి గజ్వేల్ ప్రభుత్వాసుపత్రికి తరలించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు. మెరుగైన వైద్యం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు.
సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు
రామచంద్రాపురం(పటాన్చెరు): కార్మికుల సంక్షేమం, ఉద్యోగ భద్రత, చారిత్రాత్మక వేతన ఒప్పందాలు సీఐటీయూతోనే సాధ్యమని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు, కిర్బీ యూనియన్ అధ్యక్షుడు చుక్క రాములు అన్నారు. ఆదివారం భారతినగర్ డివిజన్ పరిధిలోని ఎల్ఐజీ కాలనీ ఫంక్షన్ హాలులో జరిగిన కిర్బీ పరిశ్రమ కార్మికుల అభినందన సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కిర్బీ పరిశ్రమలో చారిత్రాత్మక వేతన ఒప్పందం జరిగిందని తెలిపారు. తాజా ఒప్పందంతో 117 మంది క్యాజువల్ కార్మికులు పర్మినెంట్ కానున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఐటీయు రాష్ట్ర ఉపాధ్యక్షుడు జే.మల్లికార్జున్, జిల్లా కోశాధికారి కే.రాజయ్య, నాయకులు మాణిక్, రాజు తదితరులు పాల్గొన్నారు.
కౌడిపల్లి: అట్రాసిటీ కేసులో తూప్రాన్ డీఎస్పీ నరేందర్గౌడ్ ఆదివారం విచారణ చేశారు. కౌడిపల్లికి చెందిన ఓ వ్యాపారి తనను కులం పేరుతో దూషించాడని కూకుట్లపల్లికి చెందిన నీరుడి బాగయ్య ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేశారు. అతని ఫిర్యాదు మేరకు డీఎస్పీ కౌడిపల్లికి వచ్చి విచారణ చేశారు.
ముగ్గురు మహిళా కార్మికులకు గాయాలు
జహీరాబాద్ టౌన్: మహిళా కార్మికులతో వెళ్తున్న స్కార్పియో బోల్తాపడిన సంఘటనలో ముగ్గురు గాయపడ్డారు. వివరాలు ఇలా.. కోహీర్ మండలంలోని వెంకటాపూర్ వద్ద గల గ్లోబల్ గ్రీన్ కంపెనీలో పనిచేయడానికి జహీరాబాద్ పట్టణం నుంచి రోజూ మాదిరిగా కార్మికులు వెళ్తున్నారు. ఈ క్రమంలో మహిళా కార్మికులతో వెళ్తున్న స్కార్పియో ఆదివారం హుగ్గెల్లి గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై అదుపుతప్పి బోల్తాపడింది. వాహనంలో ఉన్న ముగ్గు రు గాయపడ్డారు. ఓ మహిళ ఎడమచేతికి తీవ్ర గాయమైంది. వాహనదారులు వారిని వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. జహీరాబాద్ రూరల్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.


