జహీరాబాద్: జహీరాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని మురికివాడలు అభివృద్ధికి నోచుకోలేకపోతున్నాయి. దీంతో ప్రజలు అను నిత్యం అవస్థలు పడకతప్పడం లేదు. నిధులు కేటాయింపులు లేకపోవడం కూడా సమస్యకు కారణంగా ప్రజలు పేర్కొంటున్నారు. పట్టణంలోని బాగారెడ్డిపల్లి, రామ్నగర్, శాంతినగర్, డ్రైవర్స్కాలనీ, ఫరీద్కాలనీ, కాంతారెడ్డికాలనీ, బాగారెడ్డినగర్, ఆర్యనగర్, ఐడీఎస్ఎంటీ కాలనీ, వెంకటరమణకాలనీ, గడిహరిజనవాడ, పస్తాపూర్, అల్లీపూర్, హరిజనవాడలతో పాటు పలు కాలనీలు సమస్యలకు నిలయంగా మారాయి. ప్రధానంగా రోడ్ల నిర్మాణాలు లేక పోవడంతో వర్షాకాలంలో ప్రజలు రోడ్లపై నడవాలన్నా నానాఅవస్థలు పడక తప్పడం లేదు. కొత్త పాలక మండలి వస్తే సమస్యలు తీరుతాయని ఆశించిన ప్రజలకు చివరకు నిరాశే కలుగుతోంది. వర్షం కారణంగా రోడ్లన్నీ బురదమయంగా దర్శనమిస్తున్నాయి. బురదలో నుంచి రాకపోకలు సాగించాలన్నా ప్రజలు, చిన్నారులు, వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారు. రోడ్ల అధ్వాన స్థితిపై ఆయా వార్డుల్లోని కౌన్సిలర్లు నిధులు కేటాయించాలంటూ అధికారులు, ప్రభుత్వాన్ని కోరుతూ వస్తున్నారు. తన వార్డు అభివృద్ధి కోసం నిధులు కేటాయించడం లేదంటూ ఇటీవల 8వ వార్డు కౌన్సిలర్ సోని భర్త ఇర్మియా చెప్పుతో కొట్టుకుని నిరసన తెలిపిన విషయం తెలిసిందే. ఇప్పటికై నా అధికారులు, ప్రభుత్వం స్పందించి నిధులను కేటాయించాలని కౌన్సిలర్లు డిమాండ్ చేస్తున్నారు.


