కలెక్టర్ ప్రతీక్ జైన్
సంగారెడ్డి జోన్: ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (ఎస్ఐఆర్) కార్యక్రమంలో భాగంగా ఎన్యూమరేషన్ ఫారాల సమర్పణ గడువును ఈనెల 10 వరకు పొడిగించినట్లు కలెక్టర్ ప్రతీక్ జైన్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ మేరకు ఎన్నికల సంఘం సవరించిన షెడ్యూల్ను విడుదల చేసిందన్నారు. జిల్లాలో ఇప్పటివరకు ఎన్యూమరేషన్ ఫారాలు సమర్పించని అర్హులైన ఓటర్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని నిర్ణీత గడువులోగా తమ ఫారాలను సమర్పించాలని కోరారు. జిల్లాలో ఇప్పటివరకు డిజిటలైజేషన్ ప్రక్రియ 78 శాతం పూర్తయిందని తెలిపారు. నిర్ణీత గడువులోపు అన్ని ప్రక్రియలను పూర్తి చేయాలని సూచించారు.
కొండాపూర్(సంగారెడ్డి): మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శనివారం డీఎంహెచ్ఓ లలితాదేవి ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించి వైద్య సేవలపై ఆరా తీశారు. సిబ్బంది హాజరు, మందుల నిల్వలు, రోగులకు అందుతున్న చికిత్స, ప్రసూతి సేవలు తదితర అంశాలను పరిశీలించారు. ముందస్తు సమాచారం లేకుండా విధులకు గైర్హాజరైతే క్రమశిక్షణ చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఆస్పత్రికి వచ్చే రోగులతో మర్యాదగా మాట్లాడాలని సూచించారు. ఆస్పత్రిలో అవసరమైన మందులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని, ప్రతి రోగికి నాణ్యమైన వైద్యసేవలు అందించాలని ఆదేశించారు. పరిశుభ్రతపైన ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు.
నారాయణఖేడ్: ఆధునిక కోర్సులతో విద్యార్థులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని భారత్ కేర్స్ సంస్థ సీనియర్ అసోసియేట్ సీఎస్ఆర్ ప్రోగ్రామర్ మఠం సాయిప్రసాద్ తెలిపారు. శనివారం ఆయన ఖేడ్ సబ్ కలెక్టర్ ఉమాహారతితో సమావేశమయ్యారు. జిల్లా పరిధిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల్లో విద్యార్థులకు ఉచితంగా ఐబీఎం స్కిల్బిల్డ్ డిజిటల్ లెర్నింగ్ ప్లాట్ఫాం ద్వారా ఏఐ, జనరేటీవ్ ఏఐ, సైబర్ సెక్యురిటీ, డేటా అనలిటిక్స్, క్లౌడ్ కంప్యూటరింగ్, ప్రొఫెషనల్ స్కిల్స్ వంటి ఆధునిక కోర్సులను అందుబాటులోకి తెస్తున్నామని వెల్లడించారు. త్వరలో తమ సంస్థ, జిల్లా పరిపాలనా విభాగం మధ్య ఒప్పందం కుదర్చుకోనున్నట్లు తెలిపారు. త్వరలో సంబంధిత శాఖలతో సమన్వయం చేసి కార్యక్రమ అమలుకు చర్యలు తీసుకుంటామని సబ్ కలెక్టర్కు వివరించారు.
మెదక్ కలెక్టరేట్: ఏడు నెలలుగా వేతనాలు రాకపోవడంతో కుటుంబ పోషణ భారంగా మారిందని, వెంటనే పెండింగ్ వేతనాలు చెల్లించి ఆదుకోవాలని మిషన్ భగీరథ కార్మికులు డీఆర్ఓకు విజ్ఞప్తి చేశారు. ఈమేరకు శనివారం సీఐటీయూ ఆధ్వర్యంలో ఆయనను కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు మహేందర్రెడ్డి మాట్లాడుతూ.. మిషన్ భగీరథ పథకంలో గత పదేళ్లుగా పనిచేస్తున్న కార్మికులకు గత 7 నెలలుగా వేతనాలు చెల్లించకపోవడంతో అవస్థలు పడుతున్నారని వాపోయారు. ఈ సంస్థలో సుమారు 160 మంది కార్మికులు పని చేస్తున్నట్లు చెప్పారు. పెండింగ్ వేతనాలు తక్షణమే చెల్లించి కార్మికులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు నాగరాజు, కార్మికులు భాస్కర్, కుమార్, నర్సింలు, అశోక్, శ్రీనివాస్, లక్ష్మణ్ పాల్గొన్నారు.
వెల్దుర్తి(తూప్రాన్): ప్రతి ఆరోగ్య కేంద్రంలో ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందేలా కృషి చేయాలని డిప్యూటీ డీఎంహెచ్ఓ అనిల్ సిబ్బందిని ఆదేశించారు. శనివారం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో సమీక్ష నిర్వహించారు. వెల్దుర్తి, చేగుంట, మనోహరాబాద్, నార్సింగి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులు, సూపర్వైజర్లు, ఎంఎల్హెచ్పీలు, టీబీ సూపర్వైజర్లు, ఆర్బీఎస్కే బృందాల సభ్యులు పాల్గొన్నారు. ఆరోగ్యశాఖ అమలు చేస్తున్న వివిధ కార్యక్రమాల పురోగతిపై సమగ్రంగా చర్చించారు.


