కోతకు గురైన రోడ్డును పరిశీలిస్తున్న పరమేశ్వరి
నిజాంపేట(మెదక్): మండల పరిధిలోని జెడ్ చెరువు తండాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు రమావత్ చిల్లి మంతులాల్ ఇల్లు పూర్తిగా దెబ్బతింది. ఇంటి గోడ కూలిపోవడంతో బాధిత కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే, ఇల్లు కూలిపోవడంతో నివాసం లేక రోడ్డున పడ్డామని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. నిరుపేదలమైన తమను ప్రభుత్వం ఆదుకోవాలని, ’ఇందిరమ్మ ఇల్లు’ మంజూరు చేయాలని కోరారు.
రామాయంపేట(మెదక్): ఐదు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో మండలంలోని దెబ్బతిన్న పర్వతాపూర్ రహదారిని బుధవారం మెదక్ ఆర్టీసీ డిపో మేనేజర్ పరమేశ్వరి పరిశీలించారు. పుష్పాలవాగు బ్రిడ్జి వద్ద రోడ్డు చివరలో కొట్టుకుపోయి ప్రమాదకరంగా మారడంతో బస్సు నడపడం కష్టతరమని వ్యాఖ్యానించారు. ఈ దారిలో బస్సు తిరిగితే మట్టి రోడ్డులో దిగబడి ప్రమాదం జరిగే అవకాశం ఉందన్నారు. వెంటనే రోడ్డును మరమ్మతులు చేయించాలని పర్వతాపూర్ సర్పంచ్ తార్యానాయక్కు సూచించారు. మరమ్మతులు చేయిస్తానని, బస్సును బంద్ చేయవద్దని సర్పంచ్ డీఎంకు విజ్ఞప్తి చేశారు.


