ఒకరికి తీవ్ర గాయాలు
ములుగు(గజ్వేల్): రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతిచెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన మండలంలోని తునికిబొల్లారం శివారులో జరిగింది. ఎస్సై రఘుపతి కథనం ప్రకారం.. మండలంలోని నర్సాపూర్కు చెందిన ఎండపల్లి సహదేవ్ ప్రైవేట్ ఉద్యోగి. ఆయనకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. కుమార్తెకు ఇటీవల కూతురు జన్మించడంతో సోమవారం ఊయల కార్యక్రమం నిర్వహించారు. దీనికి కుటుంబ సభ్యులు అందరూ హాజరయ్యారు. ఈ క్రమంలో సహదేవ్ కుమారుడు హరిమోహన్(22), అన్న మనవడు హరిచరణ్ యాక్టీవాపై తునికి బొల్లారం వెళ్లి తిరిగి వస్తుండగా మధ్యాహ్నం 3 గంటల సమయంలో గ్రామ శివారులో ఎదురుగా వస్తున్న లారీ అదుపుతప్పి వీరిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్పై ఉన్న ఇద్దరూ రోడ్డుపై పడిపోయారు. స్థానికులు వెంటనే ఆర్వీఎం ఆస్పత్రికి తరలించగా.. పరీక్షించిన వైద్యులు హరిమోహన్ మృతి చెందినట్లు ధృవీకరించారు. హరిచరణ్కు చికిత్స అందిస్తున్నారు. కాగా హరిమోహన్ డిగ్రీ చదువుతున్నాడు. మృతుడు తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.


