నత్తనడకన మల్లన్నసాగర్ కాల్వల నిర్మాణం
కాల్వల నిర్మాణంలో
దుబ్బాక: ‘‘తలాపున పారుతోంది గోదావరి.. మన చేను, మన చెలుక ఎడారి’’అన్న చందంగా తయారైంది దుబ్బాక నియోజకవర్గంలోని చాలా గ్రామాల పరిస్థితి. పక్కనే గోదారమ్మ పారుతున్నా.. ఈ ప్రాంత ప్రజలు గుక్కెడు నీటి కోసం గోస పడుతున్నారు. నీరు లేక పంటలు ఎండిపోతున్నాయి. కాళేశ్వరం పథకంలో భాగంగా తొగుట మండలంలో 50 టీఎంసీల సామర్ధ్యంతో మల్లన్న సాగర్ రిజర్వాయర్ను నిర్మించారు. ప్రాజెక్టు పూర్తయి ఐదేళ్లు గడుస్తున్నా.. ఇంకా చాలా కాల్వల నిర్మాణాలు అసంపూర్తిగానే మిగిలాయి. దీంతో రైతుల పంట పొలాలకు ఇప్పటికీ నీరందించలేని దయనీయ పరిస్థితి దాపురించింది. ప్రధాన కాల్వలు పూర్తయినప్పటికీ చాలా గ్రామాల్లో చెరువులు, కుంటలు నింపే చిన్న కాల్వల నిర్మాణాలు నత్తనడకనే సాగుతున్నాయి. దీంతో దుబ్బాక పెద్ద చెరువు, పెద్దగుండవెల్లి, దుంపలపల్లి ఆయకట్లు రైతులు ఆందోళన చెందుతున్నారు.
చాలా గ్రామాలకు నీరందని పరిస్థితి
మల్లన్నసాగర్ ప్రాజెక్టుకు కేవలం 10–15 కిలోమీటర్ల దూరంలోనే ఉన్నా మిరుదొడ్డి మండలంతో పాటుగా అక్బర్పేట–భూంపల్లి, దౌల్తాబాద్, రాయపోల్ మండలాల్లోని చాలా గ్రామాలకు కాల్వల నీరు అందని పరిస్థితి నెలకొంది. అలాగే.. తొగుట మండలంలోని గుడికందుల, గోవర్ధనగిరి, వర్ధరాజుపల్లి గ్రామాల్లో కాల్వల నుంచి నీరు రాక వేసిన పంటలు ఎండిపోయే పరిస్థితి నెలకొంది. నియోజకవర్గంలోని చేగుంట, నార్సింగ్ మండలాల్లో సైతం కాలువ నిర్మాణంకు అటవీశాఖ అధికారుల అనుమతి నిరాకరించడంతో మధ్యలోనే నిర్మాణం ఆగిపోయింది.
పలుసార్లు విన్నవించిన ఎమ్మెల్యేలు
మల్లన్నసాగర్ ప్రాజెక్టు అనుసంధానంగా నీరందించే కాల్వలు చాలా చోట్ల పెండింగ్లో ఉన్నాయని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డిలకు ఎమ్మెల్యేలు ప్రభాకర్రెడ్డి, హరీశ్రావు పలుమార్లు విన్నవించారు. గత అసెంబ్లీ సమావేశాల్లో సైతం ఇదే అంశాన్ని ప్రస్తావించారు. అయినా ఇంత వరకు కాల్వల నిర్మాణం పూర్తికాకపోవడం శోచనీయం.
ఐదేళ్లుగా అసంపూర్తిగానే పనులు
భూసేకరణ, అటవీ భూముల సమస్యే కారణం
కాల్వలు పూర్తి చేసి పంటలు కాపాడాలంటున్న రైతులు


