●ఏర్పాటు కాని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ●ప్రైవేట్ వ్యాపారులను ఆశ్రయిస్తున్న కర్షకులు
రాయికోడ్(అందోల్): శనగ సాగు చేసిన రైతులు తల్లడిల్లుతున్నారు. యాసంగి పంట కోత పనులు ముమ్మరంగా సాగుతుండగా, ఆశించిన స్థాయిలో ఎకరాకు 9 నుంచి 12 క్వింటాళ్ల మేర దిగుబడి వస్తుంది. తీరా పంట విక్రయిద్దామంటే ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. ప్రైవేట్ వ్యాపారులకు విక్రయించి రూ. వేలల్లో నష్టపోతున్నారు. కొందరు పంటను ఇంట్లో నిల్వ చేస్తున్నారు. కాగా పంట కోత సమయానికై నా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తారని ఆశించిన రైతులకు నిరాశే మిగిలింది. విక్రయ కేంద్రాలపై ఇప్పటివరకు స్పష్టత రాకపోవడంతో అయోమయానికి గురవుతున్నారు.
జిల్లాలో 20,574 ఎకరాల్లో సాగు
ప్రభుత్వం క్వింటాల్ శనగల ధర రూ. 5,650గా నిర్ణయించింది. ఆశించిన దిగుబడి రావడంతో నిర్ణయించిన ధరతో విక్రయిస్తే లాభాలు వస్తాయని రైతులు ఆశించారు. కానీ ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు కాకపోవడంతో ప్రైవేట్ వ్యాపారులు పంట ఉత్పత్తులు కొనుగోలు చేస్తున్నారు. కాగా వారు క్వింటాల్కు రూ.5 వేల లోపే చెల్లిస్తున్నారు. జిల్లాలో 20,574 ఎకరాల్లో శనగ సాగు చేయగా, రాయికోడ్ మండలంలో అత్యధికంగా 5,346 ఎకరాల్లో పంట సాగు చేశారు. ఇప్పటికై నా మార్కెటింగ్, మార్క్ఫెడ్, వ్యవసాయశాఖల అధికారులు రైతుల ఇబ్బందులను గుర్తించి పంట విక్రయంలో ఇబ్బందులు లేకుండా కేంద్రాలను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.
శనగల కొనుగోలు కేంద్రం ప్రారంభించేందుకు ప్రభుత్వం నుంచి జీఓ రాలేదు. అనుమతులు రాగానే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులకు ప్రయోజనం చేకూరేలా చూస్తాం.
– శ్రీదేవి, మార్క్ఫెడ్ డీఎం
ఎకరంలో శనగ పంట సాగు చేశాను. 9 క్వింటాళ్ల మేర దిగుబడి వచ్చింది. ప్రభుత్వ కొనుగోలు కేంద్రం ప్రారంభం కాకపోవడంతో ప్రైవేట్ వ్యాపారులకు రూ. 5 వేలకు క్వింటాల్ చొప్పున పంట విక్రయించా. ప్రభుత్వ మద్దతు ధర కన్నా క్వింటాల్కు రూ. 650 తక్కువ వచ్చాయి.
– పరుశురామ్, రైతు, ఖాంజమాల్పూర్


