దుబ్బాక: బీడీ కార్మికులకు పెరిగిన కరువు భత్యం యజమాన్యాలు అమలు చేయాలని బీడీ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర సహాయ కార్యదర్శి దీకొండ శ్రీనివాస్ డిమాండ్ చేశారు. మంగళవారం దుబ్బాకలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో బీడీ పరిశ్రమపై ఆధారపడ్డ 7 లక్షలకు పైగా కార్మికులకు ప్రతి సంవత్సరం లాగే ఈ యేడు కరువు భత్యం పెరిగిందన్నారు. వెయ్యి బీడీలకు రూ.5.50 పైసలు, నెలసరి ఉద్యోగులకు నెలకు రూ.165 పెరిగిందన్నారు. వెయ్యి బీడీలకు రూ.268.31 పైసల చొప్పున ఇవ్వాల్సి ఉంటుందని, ఈ పెరిగిన కరువు భత్యం ఏప్రిల్ 1 నుంచి అమలులోకి వస్తుందన్నారు. పెరిగిన కరువు భత్యం అన్ని బీడీ కంపెనీల యజమాన్యాలు అమలు చేయాలని లేనిచో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడుతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో నాయకులు రవీందర్, సిద్ధయ్య, సత్యనారాయణ తదితరులు ఉన్నారు.


