అడవి పందుల బీభత్సం
పంటలు పాడు చేస్తున్న వైనం
● తీవ్రంగా నష్టపోతున్న రైతులు ● ప్రభుత్వం ఆదుకోవాలని వినతి
జిల్లాలోని న్యాల్కల్, రాయికోడ్, ఝరాసంగం, జహీరాబాద్, మానూర్, నారాయణఖేడ్, కోహీర్ తదితర మండలాల్లో అడవి పందుల సంచారం ఎక్కువగా ఉంది. కర్నాటక సరిహద్దులో అడవుల విస్తీర్ణం ఎక్కువగా ఉండటం వల్ల అక్కడి నుంచి పందులు ఎక్కువగా ఇక్కడకు వస్తున్నాయి. ప్రస్తుతం చెరకు పంటతో పాటు జొన్న, శనగ, ఆయిల్ పామ్, కూరగాయలు, ఇతర పంటలను రైతులు సాగు చేస్తున్నారు. ఈ క్రమంలో అడవి పందుల గుంపు పంటలను తిని, ధ్వంసం చేస్తున్నాయని ఆయా గ్రామాల రైతులు చెబుతున్నారు. వాటి బారి నుంచి పంటలను కాపాడుకునేందుకు చేను చుట్టూ పాత చీరలు కట్టడం, పొలాల చుట్టూ ఇనుప తీగలు అమర్చడం, రాత్రి వేళల్లో పటాసులు పేల్చడం లాంటివి చేస్తున్నారు. ఫలితంగా కొంత వరకు రక్షించుకుంటున్నామని తెలిపారు. ప్రతిరోజు పంటలకు కాపలా వెళ్లాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు చర్యలు తీసుకొని పంట నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలని రైతులు కోరుతున్నారు.
రాత్రి ఫూట అడవి పందులు పంటలపై దాడి చేసి తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నాయి. పంటలను తిని పాడు చేస్తున్నాయి. వాటి బెడద నుంచి పంటలను రక్షించుకునేందుకు రైతులు నానా అవస్థలు పడుతున్నారు. కళ్లెదుటే పంటలు పాడవడంతో అన్నదాతలు దిక్కుతోచని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో అడవి పందుల బెడద తీవ్రమైంది. పంటలను రక్షించుకునే క్రమంలో రైతులపై కూడా దాడి చేస్తున్నాయి.
–న్యాల్కల్(జహీరాబాద్)
అడవి పందుల బీభత్సం


