ఇసుక డంప్ సీజ్
సంగారెడ్డి : మంజీరా నది నుంచి అక్రమంగా తరలిస్తున్న నాలుగు ట్రాక్టర్ల ఇసుకను రెవెన్యూ అధికారులు సీజ్ చేశారు. వివరాలు ఇలా... చౌటకూరు మండలంలోని సరాఫ్పల్లి శివారులో అక్రమంగా డంప్ చేసిన ఇసుక కుప్పలను ఆర్ఐ ప్రమోద్ కుమార్ ముగ్గు పోసి సీజ్ చేయించారు. ఈ ఇసుకను రెండు రోజుల్లో వేలం వేస్తామని తెలిపారు.
జాతీయస్థాయి పోటీలకు అక్షిత్
గజ్వేల్రూరల్: జాతీయ స్థాయి వాలీబాల్ పోటీలకు విద్యార్థి ఎం.అక్షిత్ ఎంపికై నట్లు సేయింట్ జోసెఫ్ పాఠశాల ప్రిన్సిపాల్ సుష్మ, కరస్పాండెంట్ బ్రిజ్గిట్ శనివారం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణంలోని 8వ తరగతి చదువుతున్న విద్యార్థి అక్షిత్ ఇటీవల కరీంనగర్ జిల్లా పెద్దపల్లిలో జరిగిన రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీల్లో ప్రతిభ చాటి అండర్–14 విభాగంలో జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. ఈనెల 5 నుంచి 9వ తేదీ వరకు హిమాచల్ప్రదేశ్లో జరగనున్న 69వ జాతీయస్థాయి వాలీబాల్ పోటీల్లో పాల్గొననున్నాడు. అనంతరం విద్యార్థితోపాటు పీఈటీ నర్సింహులును అభినందించారు. సిస్టర్ శౌరీట్రెసా, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
స్వప్నశ్రీకి ఉత్తమ
ఉపాధ్యాయ అవార్డు
చేగుంట(తూప్రాన్): మాసాయిపేట మండలంలోని చెట్లతిమ్మాయిపల్లి పాఠశాల హిందీ ఉపాధ్యాయురాలు స్వప్నశ్రీ సౌత్ ఇండియా ఉత్తమ ఉపాధ్యాయురాలి అవార్డును అందుకున్నారు. విజయవాడలో గురుచైతన్య ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే జయంతి నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠాలు బోధించడంతో పాటు విద్యార్థుల చదువు కోసం ఆర్థికంగా సహకారం అందిస్తున్న స్వప్నశ్రీని సంఘం తరపున సౌత్ ఇండియా ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ఎంపిక చేశారు. సంఘం అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ విజయవాడలో సన్మానించి, అవార్డును అందజేసినట్లు స్వప్నశ్రీ తెలిపారు. ఉత్తమ ఉపాధ్యాయురాలిగా గుర్తింపు రావడంపై పాఠశాల ప్రధానోపాధ్యాయులు మధుసూదన్, గ్రామ సర్పంచ్ అంసీ, మాజీ సర్పంచ్ మోహన్రాథోడ్ హర్షం వ్యక్తం చేశారు.
నేడు ఆర్టీసీ డ్రైవర్లకు
కంటి పరీక్షలు
సంగారెడ్డి : జిల్లాలోని ఆర్టీసీ బస్సు డిపోల్లో ఆదివారం డ్రైవర్లకు ఉచిత కంటి పరీక్ష శిబిరాలు నిర్వహించనున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎం.వసంతరావు తెలిపారు. ఈ శిబిరాలను సంగారెడ్డి, జహీరాబాద్, నారాయణఖేడ్, బీహెచ్ఈఎల్ ఆర్టీసీ బస్సు డిపోల్లో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ శిబిరాల్లో పారామెడికల్ ఆప్తాల్మిక్ అధికారులు, కంటి వైద్యులు పాల్గొని ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4వరకు ఆర్టీసీ డ్రైవర్లకు సమగ్ర కంటి పరీక్షలు నిర్వహిస్తారు. ఆర్టీసీ డ్రైవర్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఇసుక డంప్ సీజ్


