శనిగరం.. సింగారం
గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యం
పెళ్లి చేసుకుంటానని మోసం..
– అసిస్టెంట్ లైన్మెన్ అరెస్ట్
సిద్దిపేటకమాన్: పెళ్లి చేసుకుంటానని సంబంధం మాట్లాడుకుని ఎంగేజ్మెంట్ రోజే వేరే అమ్మాయితో పారిపోయిన అసిస్టెంట్ లైన్మెన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన సిద్దిపేట పట్టణంలో చోటు చేసుకుంది. టూటౌన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రూరల్ మండలం మాచాపూర్ గ్రామానికి చెందిన పి.రామస్వామి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ లైన్మెన్గా విధులు నిర్వహిస్తున్నాడు. అతడి కుటుంబ సభ్యులు గత నెలలో సిద్దిపేట పట్టణానికి చెందిన ఓ యువతితో రామస్వామికి వివాహం నిశ్చయించారు. పెద్ద మనుషుల సమక్షంలో రూ.50లక్షలు కట్నం మాట్లాడుకుని అమ్మాయి తల్లిదండ్రులు రామస్వామికి రూ.51వేలు నగదు కట్నం కింద ఇచ్చారు. గత నెల 26న ఎంగేజ్మెంట్ ఉండగా అదే రోజు రామస్వామి తాను అంతకుముందు ప్రేమించిన వేరే అమ్మాయితో పారిపోయాడు. విషయం తెలుసుకున్న బాధిత కుటుంబ సభ్యులు తాము మోసపోయినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన ఎస్ఐ ఆసిఫ్ దర్యాప్తులో భాగంగా రామస్వామిని శుక్రవారం అరెస్ట్ చేసి, కోర్టులో హాజరుపర్చారు.
పత్తిమిల్లులో అగ్నిప్రమాదం
గజ్వేల్రూరల్: పత్తిమిల్లులో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటన శుక్రవారం మండల పరిధిలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా... బయ్యారం సమీపంలోని శివగంగ పత్తిమిల్లులోని మెషిన్ నుంచి నిప్పురవ్వలు చెలరేగి బెల్టు మంటల్లో కాలిపోయింది. ఈ సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పివేయడంతో పెనుప్రమాదం తప్పింది. ఈ ఘటనలో సుమారు రూ. 70వేల ఆస్తినష్టం జరిగింది. కాగా మిల్లులోని పత్తికి ఎలాంటి నష్టం వాటిల్లలేదని నిర్వాహకులు తెలిపారు.
బైక్ దొంగలు అరెస్ట్
సంగారెడ్డి క్రైమ్: బైక్ను ఎత్తుకెళ్లిన నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం పట్టణ పోలీస్ స్టేషన్లో కేసుకు సంబంధించిన వివరాలను సీఐ రాము నాయుడు వెల్లడించారు. కామారెడ్డి జిల్లాకు చెందిన బుయ్య రంజిత్ (24), మెదక్ జిల్లా రేగోడు మండలానికి చెందిన చాకలి రాజు(24), ఇద్దరు పట్టణంలోని పుట్పాత్పై ఉంటున్నారు. ఈ క్రమంలో బైకులను దొంగిలించాలని పథకం వేసుకున్నారు. ఈ నెల 25తేదీన పట్టణంలోని శాంతినగర్ కాలనీకి చెందిన పి.సురేశ్ రెడ్డి అపార్ట్మెంట్లో బైక్ను పార్కు చేసి పని నిమిత్తం హైదరాబాద్కు వెళ్లాడు. గురువారం అర్ధరాత్రి ద్విచక్ర వాహనం ఎత్తుకెళ్లారు. అదే రోజు పోలీసులకు ఫిర్యాదు చేశారు. శుక్రవారం సాయంత్రం వైకుంఠపురం వద్ద పోలీసులు వాహనాలు తనిఖీలు చేస్తుండగా, ద్విచక్ర వాహనంపై అటుగా వచ్చిన ఇద్దరు అనుమానితులు రంజిత్, రాజులను అరెస్టు చేసి విచారించగా నేరం అంగీకరించారు. వారి వద్ద నుంచి బైకును స్వాధీనం చేసుకున్నారు.
మండలంలోని శనిగరం జలాశయాన్ని ఇటీవల మంత్రి పొన్నం ప్రభాకర్ సందర్శించారు. ఈ నేపథ్యంలో ఎకో టూరిజం స్పాట్గా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. ప్రస్తుతం ప్రకృతి ప్రేమికులకు కనువిందు చేస్తూ, ఇటు రైతులకు అటూ మత్స్యకారులకు ఆపన్నహస్తంగా నిలుస్తుంది. చుట్టూ ఎత్తయిన పచ్చని గుట్టల మధ్య నిలిచిన నీటితో ప్రాజెక్ట్ నిండుకుండలా ప్రకృతి ప్రేమికులను ఆకర్షిస్తుంది. రాజీవ్ రహదారికి చేరువలో ఉండటంతో పర్యాటకానికి కలిసొచ్చే అంశం. ఇప్పటికే వర్షాకాలంలో వందల మంది పర్యాటకులు వస్తున్నారు.
– కోహెడరూరల్(హుస్నాబాద్)
నిండుకుండలా శనిగరం ప్రాజెక్ట్
ఈ ప్రాజెక్ట్ వెనుక అద్భుతమైన చారిత్రక నేపథ్యం ఉంది. నిజాం కాలంలో 1891లో మధ్యతరహ ప్రాజెక్ట్గా పునరుద్ధరించడానికి 560 సీర్లు(504 కిలోల బంగారం) ఖర్చు చేసి నిర్మించారు. చారిత్రక ఘనత కలిగిన ఈ జలాశయం నేడు బహుళ ప్రయోజనకారిగా మారింది. అందుకే స్థానికులు ఇప్పటికీ అత్యంత విలువైన బంగారు ప్రాజెక్ట్గా చెప్పుకుంటారు. ప్రాజెక్ట్ కట్టి 134 ఏళ్లు గడిచినా చెక్కు చెదరకుండా ఉంది. ఆ నాటి నిర్మాణాన్ని చూసేందుకు సందర్శకులు ఆసక్తి చూపుతున్నారు. పర్యాటక హబ్గా మారడానికి ఉన్న ప్రధాన ఆకర్షణలో ఇది ఒకటి
టూరిజం స్పాట్గా అభివృద్ధి చేసేలా ప్రణాళికలు
● పచ్చని ప్రకృతి ఒడిలో జలాశయం
● ఇప్పటికే రైతులకు, మత్స్యకారులకు జీవనోపాధి
● రాజీవ్ రహదారికి చేరువలో డెస్టినేషన్
ఎకో టూరిజానికి ప్రణాళిక
మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాలతో ఈ ప్రాతాన్ని ఎకో టూరిజం సర్క్యూట్లో భాగంగా అభివృధ్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. పర్యాటకుల కోసం వ్యూ పాయింట్లు, కాటేజీలు, సెల్ఫీ పాయింట్లు ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నాయి. అలాగే ఈ ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేస్తే స్థానిక యువతకు భారీగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఇక్కడ బోటింగ్ సౌకర్యం, గార్డెనింగ్ వ్యూ పాయింట్లు ఏర్పాటు చేస్తే జిల్లాలోనే అత్యుత్తమ పిక్నిక్ స్పాట్గా మారుతుందని స్థానికులు కోరుతున్నారు.
సాగుతో పాటు మత్స్య సంపద
ఈ ప్రాజెక్ట్ 5,100 ఎకరాలకు సాగునీటిని అందించడమే కాకుండా 281 హెక్టార్ల విస్తీర్ణంలో మత్స్యకారులకు ఉపాధి కల్పిస్తోంది. చేపల ఉత్పత్తి సామర్థ్యాలు ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా మార్చడంలో అదనపు బలాలుగా నిలుస్తాయి. పచ్చని పొలాలు, మత్స్యకారుల చేపల వేట దృశ్యాలు పర్యాటకులకు మరింత ఆహ్లాదాన్నిస్తున్నాయి. పర్యాటకులు సైతం ఇక్కడికి వచ్చినప్పుడు తాజా చేపలు కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. త్వరగా పర్యాటక హబ్గా అభివృద్ధి చేస్తే సిద్దిపేట జిల్లాకే ఒక మైలురాయిగా నిలువనుంది.
వసతులు కల్పించాలి
పర్యాటకుల తాకిడి పెరుగుతున్న నేపథ్యంలో అధికారులు పర్యాటక కేంద్రంగా ఏర్పాటు చేయాలి. ఆ దిశగా అభివృద్ధి చెందితే స్థానికులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి. బోటింగ్, పిల్లలకు ప్రత్యేక పార్కులు, వాకింగ్ ట్రాక్ లాంటి మౌలిక సదుపాయాలపై దృష్టి సారించాలి.
– గునిగంటి అజయ్, విద్యార్థి, శనిగరం
సరదాగా గడపడానికి..
వీకెండ్లో ఫ్యామిలీ లేదా ఫ్రెండ్స్తో గడపడానికి బెస్ట్ స్పాట్. గుట్టల మధ్య అందమైన లొకేషన్ ఉంటుంది. ఇక్కడి పచ్చదనం ఆ మత్తడి దూకే జలపాతం చూస్తుంటే మనసుకి ప్రశాంతంగా ఉంటుంది. రాజీవ్ రహదారికి దగ్గరగా ఉంటుంది. ప్రకృతిని ప్రేమించే వారు ఒక్కసారైనా చూడాల్సిన చోటు.
– ద్యాగటి హరీశ్, పర్యాటక ప్రేమికుడు
వర్షాకాలంలో ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకున్నప్పుడు మత్తడి నుంచి నీరు పాలధారలా కిందకు దూకుతుంది. ఈ అద్భుతమైన దృశ్యాన్ని చూసేందుకు పర్యాటకులు భారీగా తరలివస్తారు. ఇక్కడి మత్తడి బండలు, ప్రాజెక్ట్ పరిసరాలు సెల్ఫీలకు ఫొటోషూట్లకు అనువుగా ఉండటంతో సోషల్ మీడియాలోనూ ఈ ప్రాంతానికి మంచి ప్రచారం లభిస్తుంది.
హత్నూర(సంగారెడ్డి): నదిలో పడి గల్లంతైన పశువుల కాపరి మృతదేహం శుక్రవారం లభ్యమైంది. ఈ ఘటన మండల పరిధిలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా... కాసాల గ్రామానికి చెందిన రేగళ్ల స్వామి(26) గురువారం గ్రామ శివారులోని మంజీర పరివాహక ప్రాంతంలో పశువులని మేపడానికి వెళ్లాడు. ఈ క్రమంలో అతడు ప్రమాదవశాత్తు నదిలో పడి గల్లంతయ్యాడు. సాయంత్రం పశువులు ఇంటికి వచ్చినా అతడు రాలేదు. దీంతో శుక్రవారం ఉదయం పోలీసులు గజ ఈతగాళ్ల సహాయంతో నదిలో గాలింపు చర్యలు చేపట్టారు. పశువుల కాపరి మృతదేహం లభించడంతో కుటుంబీకులు, గ్రామస్తులు బోరున విలపించారు. మృతుడికి భార్యతో పాటు ఒక కుమారుడు ఉన్నారు. మృతుడికి కొంతకాలంగా మూర్ఛ వ్యాధి ఉన్నట్లు స్థానికులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసినట్లు ఎస్సై శ్రీధర్ రెడ్డి తెలిపారు.
శనిగరం.. సింగారం
శనిగరం.. సింగారం
శనిగరం.. సింగారం
శనిగరం.. సింగారం
శనిగరం.. సింగారం


