
బైక్ దొంగ అరెస్టు
న్యాల్కల్(జహీరాబాద్): బైక్ను దొంగిలించిన వ్యక్తిని హద్నూర్ పోలీసులు శుక్రవారం పట్టుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం... మండల పరిధిలోని గంగ్వార్ గ్రామానికి చెందిన నడిమిదొడ్డి అశోక్ నెల రోజుల క్రితం పొలానికి వెళ్లాడు. అక్కడ బైక్ను నిలిపి ఉంచగా గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. శుక్రవారం గంగ్వార్ చౌరస్తా వద్ద ఎస్ఐ సుజిత్ సిబ్బందితో కలిసి వాహనాల తనిఖీలో భాగంగా బీహార్కు చెందిన లక్ష్మణ్ టీఎస్15 ఎఫ్ 8026 బైక్పై వెళ్తున్నాడు. పోలీసులు బైక్ను ఆపి వాహన పత్రాలు అడగగా గంగ్వార్లో బైక్ను దొంగిలించినట్లు నిందితుడు తెలిపాడు. బైక్ను స్వాధీనం చేసుకుని నిందితున్ని అరెస్టు చేశారు.
చిన్నశంకరంపేట(మెదక్): మండలంలోని ఖాజాపూర్ ప్రాథమికోన్నత పాఠశాలలో జాతీయ జెండాకు అవమానం జరిగింది. స్వాతంత్య్ర వేడుకల్లో భాగంగా పాఠశాలలో హెచ్ఎం జెండాను ఆవిష్కరించే క్రమంలో పైకి వెళ్లాక ముడి రాలేదు. దీంతో తాడును హెచ్ఎం బలంగా లాగడంతో జెండా తాడు నుంచి తెగిపోయి నేలమీద పడింది. వెంటనే సిబ్బంది జెండా పైపును కిందకు తీసి తిరిగి జెండాను ముడి వేసి ఆవిష్కరించారు. బాధ్యత గల ప్రాధానోపాధ్యాయుడు జెండాను ఆవిష్కరించే సమయంలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడంపై గ్రామస్తులు మండిపడ్డారు.
సిద్దిపేటకమాన్: చెరువులో కుళ్లిన స్థితిలో గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. వన్టౌన్ సీఐ వాసుదేవరావు వివరాల ప్రకారం... పట్టణంలోని కోమటి చెరువులో శుక్రవారం మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని బయటకు తీయగా ఎలాంటి ఆధారాలు లభించలేదు. గుర్తు పట్టడానికి వీలులేకుండా కుళ్లిన స్థితిలో ఉంది. మృతుడి వయస్సు సుమారు 35నుంచి 40ఏళ్లు ఉంటుందని సీఐ తెలిపారు. మృతుడి కుడి చేతికి మూడు వరుసల జపమాల, రాఖీ కట్టి ఉంది. మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీకి తరలించి, కేసు నమోదు చేశారు.
నర్సాపూర్రూరల్: మండలంలోని అవంచ గ్రామంలో మల్లారెడ్డి యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ సైన్సెస్ ఫైనల్ ఇయర్ విద్యార్థులు శుక్రవారం పర్యటించారు. ఈ సందర్భంగా డాక్టర్ భార్గవి, రవికుమార్ ఆధ్వర్యంలో విద్యార్థులు పార్టిసిపేటరీ రూరల్ అప్రైజల్ కార్యక్రమం నిర్వహించారు. గ్రామానికి సంధించిన మ్యాప్ వేసి పంట సాగు భూములు, జనాభా, వర్ష పాతం, సీజనల్ క్యాలెండర్ వేశారు. అనంతరం గ్రామస్తులతో వ్యవసాయ పరిస్థితులు, వనరులు, సమస్యలు, పరిష్కారాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు అక్షిత, అక్షయ, ఆదిరా, కీర్తన, కీర్తిప్రియ పాల్గొన్నారు.
చిన్నశంకరంపేట(మెదక్): మండలంలోని జెడ్పీ పాఠశాలకు సాతంత్య్ర వేడుకల సందర్భంగా మాజీ సర్పంచ్ శంకరప్ప మనవడు ఎన్ఆర్ఐ చంద్రశేఖర్ పాఠశాల అవరణలో స్టేజీ నిర్మాణం కోసం ముందుకొచ్చాడు. అలాగే మాజీ సర్పంచ్ స్వతంత్ర కుమార్గౌడ్ ఆర్వోప్లాంట్ ఏర్పాటు చేసేందుకు రూ. లక్ష హెచ్ఎం దీప్లారాథోడ్కు అందించారు. మిర్జాపల్లి ప్రాథమిక పాఠశాలలో విద్యావలంటీర్కు ప్రతి నెల రూ.5 వేలు ఇచ్చేందుకు మాజీ ఉప సర్పంచ్ మనోజ్ ముందుకొచ్చారు. రుద్రారం ప్రాథమిక పాఠశాలకు పూర్వ విద్యార్థులు రూ.15 వేల సౌండ్ సిస్టంను అందజేశారు.

బైక్ దొంగ అరెస్టు