పదేళ్ల నాటి ప్రతీకారంతో.. అంతమొందించి.. ఆపై దహనం! | - | Sakshi
Sakshi News home page

పదేళ్ల నాటి ప్రతీకారంతో.. అంతమొందించి.. ఆపై దహనం!

Oct 13 2023 4:50 AM | Updated on Oct 13 2023 12:52 PM

- - Sakshi

సంఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్న డీఎస్పీ వెంకట్‌రెడ్డి, రాములు(ఫైల్‌)

సంగారెడ్డి: పదేళ్ల నాటి ప్రతీకారం ఒక వ్యక్తిని హత్యచేసి దహనం చేసిన ఘటన సిర్గాపూర్‌ మండలం ఖాజపూర్‌ శివారులోని అటవీ ప్రదేశంలో గురువారం వెలుగు చూసింది. కల్హేర్‌ మండలం మీర్ఖాన్‌పేటకు చెందిన ముప్పిడి రాములు(35) హత్యకు గురయ్యాడు. ప్రత్యర్థులు పెట్రోలు పోసి మృతదేహాన్ని దహనం చేశారు. కామారెడ్డి జిల్లా నిజాంసాగర్‌ మండలం వడ్డెపల్లి శివారులో ఖాజపూర్‌కు చెందిన కుర్మ లింగవ్వ పదేళ్ల క్రితం హత్యకు గురైంది.

అప్పట్లో ముప్పిడి రాములుపై నిజాంసాగర్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. దీంతో ఏడేళ్ల జైలు శిక్ష అనుభవించాడు. రాములును చంపేందుకు లింగవ్వ కుటుంబ సభ్యులు కక్ష పెంచుకున్నారు. బుధవారం సాయంత్రం రాములును నమ్మబలికి హత్య చేసినట్లు తెలుస్తోంది. మృతదేహాన్ని అడవిలో దహనం చేశారు. అయితే లింగవ్వ కొడుకు కుర్మ గోపాల్‌, భర్త పాపిగొండ పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు సమాచారం.

పదేళ్ల క్రితం హత్యకు గురైన లింగవ్వ కూతురు సత్యవ్వను చంపేందుకు రాములు యత్నించినట్లు ఖాజపూర్‌లో ప్రచారం జరుగుతోంది. అందుకే రాములును పథకం ప్రకారమే హత్య చేసినట్లు చెబుతున్నారు. ఘటనా స్థలాన్ని నారాయణఖేడ్‌ డీఎస్పీ వెంకట్‌రెడ్డి, కంగ్టీ సీఐ జక్కుల హన్మంతు సందర్శించారు. వారు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement