
మాట్లాడుతున్న ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి
గిరిజనులకు శాశ్వత రిజర్వేషన్ కల్పించిన ఘనత కేసీఆర్దే
జహీరాబాద్ టౌన్: తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చి గిరిజనులకు శాశ్వత రిజర్వేషన్ కల్పించిన ఘనత సీఎం కేసీఆర్దేనని ఎమ్మెల్యే మాణిక్రావు అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శనివారం మొగుడంపల్లి మండలంలోని మీర్జంపల్లి తండాలో నిర్వహించిన గిరిజన దినోత్సవంలో మాట్లాడారు. సీఎం కేసీఆర్ తండాల పరిస్థితులు, బాధలను అర్థం చేసుకుని వారి సంక్షేమం కోసం ఎన్నో చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. అంతకు ముందు రూ.20 లక్షల ఎస్టీ నిధులతో చేపట్టిన నూతన పంచాయతీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో డీఆర్డీఓ జయదేవ్, ఎంపీడీఓ మహేష్, ఆత్మ కమిటీ చైర్మన్ పెంటారెడ్డి, సొసైటీ చైర్మన్ మచ్చేందర్ పాల్గొన్నారు.
పటాన్చెరు: గిరిజనుల జీవితాల్లో వెలుగులు నింపి తండాలను అభివృద్ధి కేంద్రాలుగా తీర్చిదిద్దిన మహా నాయకుడు సీఎం కేసీఆర్ అని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా 16వ రోజు శనివారం అమీన్పూర్ మండలం ఐలాపూర్ తండాలో నిర్వహించిన తెలంగాణ గిరిజన దినోత్సవం వైభవంగా జరిగింది. గిరిజన మహిళలతో కలిసి ఎమ్మెల్యే నృత్యం చేసి అందర్నీ ఉత్సాహపరిచారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో గిరిజనులు ఆత్మగౌరవంతో జీవిస్తున్నారన్నారు. తండాలను గ్రామపంచాయతీలుగా తీర్చిదిద్ది పరిపాలనలోనూ వారికి సముచిత స్థానం కల్పించడం జరిగిందన్నారు. కార్యక్రమాల్లో అమీన్పూర్ ఎంపీపీ దేవానందం, జెడ్పీటీసీ సుధాకర్ రెడ్డి, పటాన్చెరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్కుమార్, గ్రామ సర్పంచ్ మాధవి రవి పాల్గొన్నారు.
స్వరాష్ట్రంలోనే తండాల అభివృద్ధి : చింతా ప్రభాకర్
కొండాపూర్(సంగారెడ్డి): సమైక్య పాలనలో గిరిజన తండాలు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండేవని తెలంగాణ హ్యాండ్లూమ్ కార్పొరేషన్ చైర్మన్ చింతా ప్రభాకర్ అన్నారు. తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా గిరిజన సంక్షేమ పండగ కార్యక్రమాన్ని పురస్కరించుకొని శనివారం మండల పరిధి తమ్మళిబాయి తండాలో రూ20 లక్షల వ్యయంతో చేపట్టిన నూతన పంచాయతీ కార్యాలయ భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత తండాలు అభివృద్ధి పథంలో పయనిస్తున్నాయన్నారు. కార్యక్రమంలో డీసీసీబీ వైస్ చైర్మన్ మాణిక్యం, ఎంపీపీ మనోజ్రెడ్డి పాల్గొన్నారు.
ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

తమ్మళిబాయి తండాలో..

పంచాయతీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేస్తున్న ఎమ్మెల్యే మాణిక్రావు