కలెక్టర్ పనితీరు భేష్
మెదక్ కలెక్టరేట్: ఏడుపాయల జాతరలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కనీస వసతులు కల్పించడంతో జిల్లా కలెక్టర్ రాజర్షిషా పనితీరు చాలా బాగుందని ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. ఏడుపాయల జాతర విజయవంతంగా నిర్వహించడంపై మంగళవారం మెదక్ కలెక్టరేట్లో అభినందన సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాజర్షిషా మాట్లాడుతూ.. అనుభవాలను దృష్టిలో ఉంచుకొని భక్తులకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఏడుపాయల దుర్గా భవానీ జాతరను వైభవోపేతంగా నిర్వహించామన్నారు. అనంతరం ఏడుపాయల జాతరలో ఉత్తమ సేవలందించిన అధికారులు, పాలక వర్గం, అర్చకులు, మండల నాయకులు తదితరులను శాలువా, జ్ఞాపికతో ఆమె సన్మానించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రమేశ్, ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్రెడ్డి, రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షడు సోములు, మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు జగన్, ఆలయ కమిటీ చైర్మన్ బాలాగౌడ్, ఈఓ శ్రీనివాస్, పాలకవర్గ సభ్యులు, పాపన్నపేట వైస్ ఎంపీపీ విష్ణువర్దన్రెడ్డి, ప్రజాప్రనిధులు పాల్గొన్నారు.
మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి