
‘స్మార్ట్’ఫోన్లకు కట్టుబానిసలవుతున్న యువత
అనారోగ్యాలను ‘టచ్’చేసి తెచ్చుకుంటున్నాం
‘డిజిటల్ డీటాక్స్’తో ఫోన్కు దూరమవుదాం
మనవాళ్లకు, మంచి అలవాట్లకు దగ్గరవుదాం
కర్ణుడి కవచ కుండలాల్లా స్మార్ట్ ఫోన్ ఇప్పుడు మన శరీరంలోనూ ఒక భాగంగా మారిపోయింది. ఫోన్ ఉంటేనే అన్ని అవయవాలూ ఉన్నట్లు! ఫోన్ చూస్తుంటేనే అన్ని అవయవాలూ బాగా పని చేస్తున్నట్లు! నిద్రలోను, మెలకువలోను మన మైండ్ ఫోన్ మీదే. ఫోన్కి ఇంతగా ‘కట్టు బానిస’అయిపోతే ఆరోగ్యం దెబ్బతింటుందని వైద్యులు హెచ్చరిస్తున్నా ఫోన్ని వదల్లేకపోతున్నాం.
అది మన తప్పు కాదు. ఫోనే మనల్ని వదలటం లేదు. మరి దీనికి పరిష్కారం లేదా? లేకనేం, ‘డిజిటల్ డీటాక్స్’ఉంది అంటున్నారు వైద్య నిపుణులు, సైకాలజిస్టులు. ఇటీవల కర్ణాటక ప్రభుత్వం, అఖిల భారత గేమింగ్ ఫెడరేషన్తో కలిసి బెంగళూరులో ‘బియాండ్ స్క్రీన్స్’అనే కార్యక్రమాన్ని చేపట్టింది.
డ్రగ్స్కి బానిసలు అయినట్టే.. స్మార్ట్ ఫోన్లు, ల్యాప్టాప్ల వంటి డిటిజల్ ఉపకరణాలు, ముఖ్యంగా అందులోని సోషల్ మీడియాకు బానిసలైనవారికి కౌన్సెలింగ్ ద్వారా అవగాహన కల్పించడం దీని ముఖ్య ఉద్దేశం. అంతేకాకుండా విద్య, ఉపాధి వంటి అంశాల్లో తాత్కాలిక, దీర్ఘకాలిక పరిష్కారాలూ చూపిస్తారు. మనం డిజిటల్ ఉపకరణాలకు ఎంతగా బానిసలు అయిపోతున్నామో చెప్పేందుకు ఇదో చిన్న ఉదాహరణ మాత్రమే. దీనికి పరిష్కారమే డిజిటల్ డీటాక్స్.
స్క్రీన్పై ఈదులాట తగ్గాలి
ఫేస్బుక్, ఇన్స్ట్రాగామ్, రీల్స్, షార్ట్స్, యూట్యూబ్.. ఈ ప్రపంచంలోకి అడుగుపెడితే ఒక పట్టాన మనల్ని బయటపడనివ్వదు. ఇదో మాయాలోకం. ఫోన్లో చార్జింగ్ అయిపోయేంత వరకు స్క్రీన్పై ఈదులాట సాగుతూనే ఉంటుంది. తలనొప్పిగా ఉన్నది గమనించం. కళ్లు మసక బారుతున్నదీ పట్టించుకోం. నిస్సత్తువ, నిస్తేజం అన్నవి స్క్రీన్ని అన్నేసి గంటలు చూడటం వల్లనే అనీ గుర్తించం. అందుకే ‘డిజిటల్ డీటాక్స్’అవసరం అని నిపుణులు సూచిస్తున్నారు.
వీకెండ్లో ‘పీస్ ఆఫ్ మైండ్’
డిజిటల్ డీటాక్స్ అంటే నెమ్మదిగా స్మార్ట్ ఫోన్ స్క్రీన్ని చూసే టైమ్ని తగ్గించుకోవటం. తద్వారా అనారోగ్యాల ముప్పునుంచి తప్పించుకోవటం. మన చేతిలో పట్టే ఫోన్ని మన మెదడును అప్పగించేసి బానిసలు కాకుండా ఉండటం. మనకు వారాంతంలో ఎలా సెలవో అలాగే గ్యాడ్జెట్లకు వీక్లీ ఆఫ్ ఇవ్వాలి. వీకెండ్లో ముఖ్యమైన పనులు తక్కువగా ఉంటాయి డిజిటల్ డీటాక్స్ మొదటి దశకు ఈ రోజులు అనుకూలంగా ఉంటాయి.
డిజిటల్ డీటాక్స్ కూడా సాధనే
డిజిటల్ డిటాక్స్లో భాగంగా ముందుగా డిజిటల్ ఉపకరణాలను దూరంగా పెట్టాలి. అత్యవసరమైతే తప్ప వాటి జోలికి పోకూడదు. నిజానికిది అంత సులభమైన సాధన కాదు. ప్రారంభంలో ఏమీ తోచదు. ఎందుకంటే అలవాటైపోయిన ప్రాణం కదా. ఒంటరిగా ఉన్నట్లనిపిస్తుంది. నోటిఫికేషన్లు ఏమైనా వచ్చి ఉంటాయా అన్న ఆసక్తి, ఆందోళన మనసును పీకుతుంటుంది. స్థిమితంగా ఉండలేం. ప్రపంచంలో జరిగే అతి ముఖ్యమైన సంఘటనలు మిస్ అవుతున్నామన్నంత ఆరాటం ఉంటుంది. కానీ, ఏమీ ఫర్వాలేదు. అలవాటు అయ్యాక మాత్రం తేలిగ్గా చేయగలుగుతాం. ఫోన్ని స్విచాఫ్ చెయ్యక్కర్లేదు. ఫోన్ మీద నుంచి మనసును స్విచాఫ్ చేసుకుంటే చాలు.
పక్కా ప్లానింగ్తో..
⇒ అలాగే డీటాక్సింగ్ సమయంలో మనం చేయవలసిన పనులు ముందే అనుకుంటే మనసు ఫోన్ మీదకు మళ్లదు.
⇒ ఉదయం పూట ఖాళీ దొరికితే జిమ్కు వెళ్లొచ్చు.
⇒ పార్కులో రోజూ ఫోన్ లేకుండా రన్నింగ్, వ్యాయామం, యోగా వంటివి ఒక్కరైనా, నలుగురితో కలిసైనా చేయండి.
⇒ స్నానం చేశాక మీకు నచి్చన ఆలయానికి వెళ్లండి.
⇒ ఇంటి పనుల్లో మీ శ్రీమతికి, కుటుంబ సభ్యులకు సాయం చేయండి.
⇒ కొత్తకొత్త రకాల మొక్కలను పెంచండి.
⇒ మీ స్నేహితులకు ఫోన్ చేసి గెట్ టుగెదర్ ఏర్పాటుచేసుకోవచ్చు. కానీ, అందరూ ఫోన్లు పక్కన పెట్టేయాలన్న కండిషన్ పెట్టుకోండి.
⇒ మంచి పుస్తకం చదవండి. ఆన్లైన్లో కాదు.. కొని, చదవండి. లేదంటే ఎవరి దగ్గర నుంచైనా తీసుకుని చదవండి.
⇒ ధ్యానం అలవాటు చేసుకోండి.
⇒ మీకు బాగా దగ్గరివాళ్లు లేదా మనసుకు నచి్చన వాళ్లతో రెస్టారెంటుకు భోజనానికో, పార్కుకో, షాపింగుకో వెళ్లండి.
⇒ స్నేహితులూ, పిల్లలతో కలిసి క్రికెట్ లాంటి ఆటలు ఆడండి.
⇒ కనీసం ఏడాదికి ఒకసారి.. ఒక అనాథాశ్రమం లేదా వృద్ధాశ్రమంలో ఒక రోజు పూర్తిగా గడపండి.
⇒ మనసుంటే మార్గం ఉంటుంది. ఇలాంటి జాబితాను ఎవరికి వారు వారి ఇష్టాయిష్టాలకు అనుగుణంగా తయారుచేసుకోవచ్చు.
డిజిటల్ డిటాక్స్ ప్రయోజనాలు
⇒ మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఉత్తేజాన్ని పుంజుకుంటుంది.
⇒ మైండ్లోంచి పెద్ద లోడ్ ఏదో దిగినట్లు అనిపిస్తుంది.
⇒ సోషల్ మీడియా తెచ్చిపెట్టే ఆదుర్దా, ఆందోళన, అసహనం అన్నీ మాయం అవుతాయి.
⇒ మెదడుకు పని చెప్పడం వల్ల జ్ఞాపక శక్తి పెరుగుతుంది.
⇒ కుటుంబ సభ్యులతో గడపటం ఎంత ఉల్లాసంగా ఉంటుందో గ్రహిస్తాం.
⇒ రోజూ వందల కొద్దీ సోషల్ మీడియా పోస్టులు, వీడియోల వంటివి చూడటం వల్ల మన మెదడు ఒక విషయం మీద ఫోకస్ చేయలేదు. అదే అన్నీ ఆపేస్తే.. మన ఆరోగ్యం, భవిష్యత్తు, మనకు కావాల్సిన వారి గురించి ఆలోచించడం.. ఇలాంటి విషయాలమీద శ్రద్ధ పెట్టవచ్చు
మన పెద్దలే గురువులు
నిజానికి డిజిటల్ డీటాక్స్ ఎలా చేయాలో ఇంట్లో అమ్మమ్మలు, తాతయ్యలు, పెద్దనాన్నలు లాంటి పెద్దవాళ్లను ఎవరిని అడిగినా చెప్తారు. ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగిపోయినా వాళ్లకు అనవసరం. వాళ్లు చేయాల్సిన పనులు శ్రద్ధగా, కచి్చతంగా చేసేవాళ్లు. కుటుంబ సంబంధాలు చక్కగా నెరిపేవాళ్లు. బంధువుల కుటుంబాల్లో జరిగే అన్ని కార్యక్రమాలకూ హాజరయ్యేవారు.
అక్కడ అందరితోనూ కలిసి మాట్లాడేవారు. ఇప్పటిలా.. నలుగురూ కలిసినా ఒక్కొక్కరూ ఒక్కో ఫోను పట్టుకుని.. ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు ఉండేవారు కాదు. అలాంటి వాళ్లు లేరు అంటారా.. అయితే మీకు మళ్లీ ఫోన్లోని డిజిటల్ డీటాక్స్ యాప్లే శరణ్యం.
అవి : డిజిటల్ డీటాక్స్ డ్రాగన్స్, ఆఫ్టైమ్, ఆఫ్్రస్కీన్, హెడ్స్పేస్, యాప్డీటాక్స్.
పర్వదినాల్లో జైనులు...
మధ్యప్రదేశ్, మహారాష్ట్రలలోని కొన్ని ప్రాంతాల్లోని జైనులు.. ‘పర్యూషణ్ పర్వ్’అనే ఆధ్యాతి్మక కార్యక్రమంలో భాగంగా డిజిటల్ డిటాక్స్ చేపడుతున్నారు. కొందరు పూర్తిగా ఫోన్లు స్విచాఫ్ చేస్తే.. మరికొందరు ఆ రోజంతా వాట్సాప్ వాడకుండా ఉంటున్నారు. అహ్మదాబాద్లోని జైనులు మరో అడుగు ముందుకేసి, ఒక పోటీ కూడా పెట్టారు. రోజూ ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు.. స్మార్ట్ ఫోన్లు, ల్యాప్టాప్లు ఏవీ వాడకూడదని నిబంధన పెట్టారు. దీనికి ట్యాగ్లైన్..‘మొబైల్ ఫోన్ ఒక మంచి సేవకుడు. అదే సమయంలో ప్రమాదకరమైన గురువు కూడా’. 50 రోజులపాటు ఇలా డిజిటల్ డిటాక్స్ చేసి విజేతలుగా నిలిచిన 10 మందికి ఝార్ఖండ్లోని వారి పవిత్ర క్షేత్రానికి ఉచిత తీర్థయాత్ర ఆఫర్ ఇచ్చారు.