తరాలు మారి.. అంతరాలు పెరిగి.. | Emotional Disconnect Widens Between Youth and Elderly | Sakshi
Sakshi News home page

తరాలు మారి.. అంతరాలు పెరిగి..

Jun 16 2025 5:18 AM | Updated on Jun 16 2025 5:23 AM

Emotional Disconnect Widens Between Youth and Elderly

వయోధికులకు దూరమవుతున్న యువత 

తాతలు, బామ్మలతో తగ్గుతున్న అనుబంధం 

కుటుంబాల్లో కొరవడుతున్న ఆత్మియ పలకరింపు 

హెల్పేజ్‌ ఇండియా అధ్యయనంలో వెల్లడి 

హైదరాబాద్‌ సహా 10 నగరాల్లో సర్వే

ఈ తరం యువతకు, నిన్నటి తరం వయోధికులకు నడుమ దూరం పెరుగుతోంది. పెద్దవాళ్లను బాగా చూసుకోవడమంటే వాళ్లకు కావలసిన వైద్య సదుపాయాలను కల్పించడం, సమయానికి మందులు, భోజనం వంటివి అందజేయడమే అనే భావన పెరిగిపోతోంది. తమ భావోద్వేగాలను పిల్లలతో పంచుకోవాలని పెద్దలు ఆశిస్తుండగా, యువత మాత్రం అందుకు సిద్ధంగా లేదు. ఈ నెల 15వ తేదీన అంతర్జాతీయ వయోధికుల వేధింపుల నివారణ అవగాహన దినం సందర్భంగా హెల్పేజ్‌ ఇండియా ‘ప్రస్తుత డిజిటల్‌ యుగంలో వృద్ధాప్యంపై యువత దృక్కోణం’అనే అంశంపై సర్వే నిర్వహించింది. ఈ అధ్యయనంలో యువత, వయోధికుల అభిప్రాయాలను సేకరించారు. హైదరాబాద్‌తో పాటు దేశవ్యాప్తంగా 10 నగరాల్లో 5,798 మంది ఈ సర్వేలో పాల్గొన్నారు.  

సర్వేలోని ముఖ్యాంశాలు..
సర్వేలో వృద్ధాప్యం అంటే ఏమిటి అన్న ప్రశ్నకు 56 శాతం యువత ‘ఒంటరితనం’అని, మరో 48 శాతం ‘ఇతరులపై ఆధారపడేవారు’అని బదులిచ్చారు. అపార అనుభవం కలిగినవారు అని 51 శాతం యువత పేర్కొనగా, ‘గౌరవించవలసిన వాళ్లు’అని 43 శాతం మంది అభిప్రాయపడ్డారు.  
సర్వేలో పాల్గొన్న వయోధికుల్లో 54 శాతం మంది తాము ఒంటరితనానికి గురవుతున్నట్లు చెప్పారు. 47 శాతం మంది తమ బాధలను పూర్తిగా అర్థం చేసుకోవడం లేదని వాపోయారు. 

ఉమ్మడి కుటుంబాల్లో మాత్రం పెద్దవాళ్లకు, పిల్లలకు మధ్య అనుబంధాలు కొంతవరకు బలంగానే ఉన్నాయి. 49 శాతం యువత తమ తాత, ముత్తాతలతో ఎక్కువ సమయం గడుపుతున్నామని చెప్పారు. 50 శాతం మంది వృద్ధులు తమ కొడుకులతో ఎక్కువ అనుబంధాన్ని, 40 శాతం మంది తమ మనవళ్లతో ఎక్కువ అనుబంధాన్ని కలిగి ఉన్నామని వెల్లడించారు.  
 చిన్న కుటుంబాల్లో వయోధికులకు సముచితమైన గౌరవం లభిస్తున్నట్లు సర్వేలో తేలింది. సర్వేలో పాల్గొన్న 75 శాతం వయోధికుల్లో 46 శాతం మంది కుటుంబం తమ మాట వింటుందని, మరో 28 శాతం మంది అప్పుడప్పుడు మాత్రమే వింటుందని తెలిపారు.  

71 శాతం వృద్ధులు సాధారణ మొబైల్‌ ఫోన్లు వాడుతుండగా, 13 శాతం మంది కంప్యూటర్లు, ఇంటర్నెట్‌ సేవలను వినియోగిస్తున్నట్లు తేలింది. 66 శాతం వయోధికులు మొబైల్‌ ఫోన్‌ను ‘సాంకేతిక గందరగోళం’గా భావిస్తున్నారు. 
51 శాతం యువత, 45 శాతం వయోధికులు తరాల మధ్య అతిపెద్ద అంతరం ఉన్నట్లు పేర్కొన్నారు. 57 శాతం యువత, 49 శాతం వయోధికులు మాత్రం మనం ఒకరినొకరు బాగా అర్థం చేసుకోవచ్చుననే ఆశావహ దృక్పథాన్ని కలిగి ఉన్నారు. 
సర్వేలో పాల్గొన్న 86 శాతం వయోధికులు కుటుంబమే తమకు అండగా ఉందని తెలిపారు.

సంతోషకరమైన వృద్ధాప్యం కావాలి 
జీవితంలో ప్రతి ఒక్కరికి వృద్ధాప్యం అనివార్యమైన దశ. పెద్దలను అర్ధం చేసుకోవడంలో యువత విఫలం కావడం వల్ల చాలామంది వయోధికులు సంతోషకరమైన వృద్ధాప్యానికి దూరమవుతున్నారు. కుటుంబ సంబంధాలు బలోపేతంగా ఉంటేనే ఆ సంతోషం లభిస్తుంది. – శ్యామ్, స్టేట్‌ ప్రాజెక్ట్‌ కో–ఆర్డినేటర్, హెల్పేజ్‌ ఇండియా 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement