బీఆర్ఎస్ నాయకులు
కొడంగల్: ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం స్థానిక రెవెన్యూ కార్యాలయంలో డీటీ అనితకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాజీ కౌన్సిలర్ మధుసూదన్ యాదవ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి వెయ్యి రోజుల గడిచినా హామీలను అమలు చేయడం లేదని ఆరోపించారు. ఎకరానికి రూ.15 వేలు రైతు బంధు ఇవ్వడం లేదన్నారు. మహిళలకు రూ.2,500 ఎక్కడని ప్రశ్నించారు. వృద్ధులకు, వితంతులకు, దివ్యాంగులకు పింఛన్ల మొత్తం పెంచలేదన్నారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకం కింద తులం బంగారం ఎప్పుడిస్తారో ప్రజలకు చెప్పాలన్నారు. అర్హులకు ఇందిరమ్మ ఇండ్లు, డబుల్ బెడ్ రూం ఇండ్లు మంజూరు చేయడం లేదన్నారు. ఆరు గ్యారంటీలను అమలు చేయడం లేదన్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి రావాలని ప్రజలు కోరుతున్నారని అన్నారు. కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని అన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు ఎరన్పల్లి శ్రీనివాస్, మున్నూరు బిచ్చప్ప, శ్రీనివాస్రెడ్డి, మాఫీ వెంకటయ్య, ఏర్పుల మోహన్, జగన్, బాల్రాజు, హన్మంతు, రాజశేఖర్, రఫీ తదితరులు పాల్గొన్నారు.
గణేశ్ ఉత్సవాలకు
పకడ్బందీ చర్యలు
ఎస్పీ స్నేహ మెహ్ర
అనంతగిరి: ప్రజల సహకారంతో గణేశ్ ఉత్సవాలను విజయవంతం చేస్తామని ఎస్పీ స్నేహ మెహ్ర అన్నారు. సోమవారం నగరం నుంచి డీజీపీ సీవీ ఆనంద్ అన్ని జిల్లాల పోలీస్ ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. గణేశ్ ఉత్సవాల ఏర్పాట్లు, బందోబస్తు తదితర వాటిపై సూచనలు చేశారు. అనంతరం వికారాబాద్లోని జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ స్నేహ మెహ్ర, ఏఎస్పీ రాజేష్ మీనాతో కలిసి మాట్లాడారు. ఉత్సవాలు, నిమజ్జనం వేడుక ప్రశాంతంగా జరిగేలా అన్ని శాఖలను సమన్వయం చేసుకుంటూ పటిష్ట భద్రతా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. మండపాలను క్రమం తప్పకుండా సందర్శించి భద్రతను పర్యవేక్షించాలని సిబ్బందికి సూచించారు. నిమజ్జన రూట్లను ముందుగానే చెక్ చేసి ట్రాఫిక్ నియంత్రణ, బారికేట్ల ఏర్పాట్లు, పార్కింగ్ తదితర వాటిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.


