● పునరావాస ప్రయోజనాలను కల్పిస్తాం
● ఆలూరు భూసేకరణ సభలో
ఆర్డీఓ పార్థసింహారెడ్డి
● పరిహారం పెంచాలని రైతుల డిమాండ్
చేవెళ్ల: ఆలూరులో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటులో భాగంగా భూములు కోల్పోతున్న వారికి తగిన న్యాయం జరిగేలా కృషి చేస్తున్నామని ఆర్డీఓ పార్థసింహారెడ్డి తెలిపారు. ఈ మేరకు సోమవారం రెవెన్యూ అధికారులు, ఆలూరు సర్పంచ్ కౌలంపేట భాగ్యశేఖర్గౌడ్ ఆధ్వర్యంలో అవగాహన సమావేశం నిర్వహించారు. భూసేకరణ, పరిహారం, పునరావాసం, పునరుద్ధరణ ప్రయోజనాలను వివరించారు. నిర్వాసితులకు ప్రభుత్వం కల్పించనున్న ప్రయోజనాలను తెలియజేశారు. భూసేకరణకు సానుకులంగా స్పందించిన రైతులు, ప్రజలకు పలు సూచనలు చేశారు. ఇక్కడ ఏర్పాటు చేసే పారిశ్రామిక వాడతో స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు ఇవ్వాలని, వక్ఫ్ బోర్డు అంటూ అన్యాయం చేయకుండా పూర్తి పరిహారం రైతులకే ఇవ్వాలని కోరారు. గుంటల్లో భూమి కలిగి ఉన్న వారికి కూడా పునరావాసం కింద ఇచ్చే ప్రయోజనాలను వర్తింపజేయాలన్నారు. గ్రామంలో పెద్ద భవనాల నిర్మాణాలకు అనుమతులు ఇవ్వాలని కోరారు. దీంతో పాటు పరిహారం విషయంలో ప్రభుత్వ నిర్ణయాన్ని మార్చుకోవాలని, కోకాపేట వంటి ప్రాంతాల్లోని భూములను వందల కోట్లకు అమ్ముతున్న ప్రభుత్వం రైతులకు అందించే పరిహారాన్ని అంత తక్కువగా ఎందుకు ఇస్తోందని ప్రశ్నించారు. మరికొంత మంది ఇది వక్ఫ్బో,ర్డు భూమి కాదని ఇనాం భూమి అని కోర్టులో కేసు వేశామని, ఏళ్ల తరబడి సాగుచేసుకుంటున్న రైతులకు ఓఆర్సీలు ఇవ్వాలని న్యాయస్థానం చెప్పిందన్నారు. మోజార్జీ రైతులు భూసేకరణకు అనుకులంగా ఉండటంతోపాటు పరిహారం, ఆర్అండ్అర్ ప్రకారం కల్పించే ప్రయోజనాలపై ప్రభుత్వం పునరాలోచన చేసి రైతులకు మేలు చేయాలని కోరారు. ఈ సమావేశంలో తహసీల్దార్ కృష్ణయ్య, ఆర్ఐ ప్రవీణ్, జీపీఓలు, గ్రామ నాయకులు, రైతులు, పాల్గొన్నారు.


