మహేశ్వరం: తెలంగాణ శాసన సభ సమావేశాల సందర్భంగా నియోజకవర్గ ఎమ్మెల్యే పట్లోళ్ల సబితారెడ్డిపై పోలీసులు వ్యవహరించిన తీరు రాష్ట్ర వ్యాప్త చర్చకు తెరలేపాయి. కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనకు నిసరనగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే నల్ల రంగు దుస్తులు ధరించి వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఉద్రిక్తత నెలకొంది. తనను జుట్టు, మెడపట్టి అడ్డుకున్నారని.. ఆమె తీవ్ర అసౌకర్యానికి గురైనట్లు ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. బీఆర్ఎస్ సోషల్ మీడియా విభాగం మాజీ హోంమంత్రిగా పనిచేసిన సబితారెడ్డిపై పురుష పోలీసులు దాడి చేశారని, ఆమె గొంతు పట్టుకున్న దృశ్యాలు వీడియోల్లో స్పష్టంగా కనిపిస్తున్నాయంటూ ఆరోపించారు. ఈ ఘటన మహిళా లోకానికి అవమానమని వెంటనే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి క్షమాపణ చెప్పాలని మండిపడ్డారు. ఈ సంఘటన నేపథ్యంలో ఆమె అనుచరులు, బీఆర్ఎస్ శ్రేణులు నియోజకవర్గ వ్యాప్తంగా ధర్నాలు, నల్ల బ్యాడ్జీలు ధరించి ప్రభుత్వం తీరుపై నిరసనలు వ్యక్తం చేశారు. గతంలోనూ సభలో సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి సీతక్కతో వాగ్వాదం జరిగింది. నాటి సభలో సబితారెడ్డి కన్నీరు పెట్టుకున్న విషయం విదితమే.


