పహాడీషరీఫ్: తెలంగాణ రాజ్యాధికారి పార్టీ (టీఆర్పీ) అధికారంలోకి వస్తే ముస్లింల వెనుకబాటును దూరం చేస్తామని ఎమ్మెల్సీ, ఆ పార్టీ అధ్యక్షుడు తీన్మార్ మల్లన్న అన్నారు. జల్పల్లి సర్కిల్ పరిధిలోని షాహిన్నగర్లో ఆదివారం ఏర్పాటు చేసిన సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అంతకుముందు జల్పల్లి కమాన్ వద్ద పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మూడు పర్యాయాలు ఓటు వేయించుకొని మంత్రిగా పనిచేసిన ఎమ్మెల్యే సబితారెడ్డి జల్పల్లి ప్రాంత అభివృద్ధిని విస్మరించారని విమర్శించారు. జల్పల్లిలో కనీస సదుపాయాలు లేక ఇక్కడి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఎంఐఎం, బీఆర్ఎస్ దోస్తాన్ చేసి ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ఎన్నికల ముందు చెప్పి మాట తప్పాయన్నారు. జల్పల్లి పంచాయతీ నుంచి జీహెచ్ఎంసీ వరకు రూపాంతరం చెందడం మినహా ప్రజల తలరాతలు మారలేదన్నారు. రాష్ట్ర జనాభాలో ముస్లింల సంఖ్యకు అనుగుణంగా బడ్జెట్లో కేటాయింపులు ఉండాలని డిమాండ్ చేశారు. మోదీ హయాంలో కార్పొరేట్ శక్తులు బ్యాంక్లను లూటీ చేస్తున్నాయని ఆరోపించారు. ఈ సందర్భంగా టీఆర్పీ జిల్లా మైనార్టీ అధ్యక్షుడిగా మాజీ ఎంపీటీసీ షర్ఫూద్దీన్ హామెద్, బాలాపూర్ మండల అధ్యక్షుడిగా మజ్హర్ అలీకి నియామక పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో పార్టీ మహిళా అధ్యక్షురాలు వనజ, ఎంబీటీ అధికార ప్రతినిధి అంజదుల్లా ఖాన్, ఎంపీజే అధ్యక్షుడు మహ్మద్ అబ్దుల్ ముజీబ్ షేక్ షోయబ్ నాయకులు మహ్మద్ గౌస్, రవూఫ్, వహీద్, నయీం, అజీం, సలీం, ఫైసల్ తదితరులు పాల్గొన్నారు.
తీన్మార్ మల్లన్న


