న్యూస్రీల్
సాక్షి, రంగారెడ్డిజిల్లా: స్వైన్ఫ్లూ.. డెంగీ జ్వరాలు మళ్లీ విజృంభిస్తున్నాయి. కోవిడ్ మిగిల్చిన చేదు జ్ఞాపకాల నుంచి ఇప్పడిప్పుడే తేరుకుంటున్న జిల్లా వాసులకు తాజాగా ఫ్లూ ఫియర్ పట్టుకుంది. పూర్తిగా మాయమై పోయిందనుకున్న ఈ స్వైన్ఫ్లూ వైరస్ మళ్లీ ఒకరి నుంచి మరొకరికి విస్తరిస్తూ కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. జిల్లాలో జూలైలో రెండు స్వైన్ఫ్లూ కేసులు నమోదు కాగా, ఆగస్టులో ఏకంగా 26 కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. 2009లో హైదరాబాద్లో మొదటి సారిగా ‘హెచ్1 ఎన్1’అనే ‘ఇన్ఫ్లూయెంజా–ఎ’వైరస్ మొదటిసారిగా వెలుగులోకి వచ్చింది. అప్పట్లో పెద్ద సంఖ్యలో స్వైన్ఫ్లూ కేసులు, మరణాలు నమోదయ్యాయి. ప్రతీ రెండేళ్లకోసారి వైరస్ కొత్తగా రూపాంతరం చెందుతోంది. 2017కు ముందు ‘కాలిఫోర్నియా స్ట్రెయిన్’గా వ్యాప్తిలో ఉన్న వైరస్ రెండేళ్ల కిందట ‘మిషిగాన్ స్ట్రెయిన్’గా కొత్త అవతారమెత్తింది. 2015–2019 మధ్య కాలంలో ఎంతో మందిని పొట్టన పెట్టుకుంది. ఆ తర్వాత వైరస్ కొంత తగ్గుముఖం పడుతూ వచ్చింది. గత ఆరేళ్లుగా ఆనవాళ్లు పెద్దగా కనింపచలేదు. తాజాగా 2026 జూలై, ఆగస్టు మాసాల్లో మళ్లీ స్వైర విహారం చేస్తోంది. ఒకరి నుంచి మరొకరికి విస్తరిస్తూ, సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది.
ఒక్క నెలలో 132 డెంగీ కేసులు
ఎల్నినో కారణంగా ప్రస్తుతం వర్షాలు కూడా లేవు. ఇంటి ఆవరణలోని పూల కుండీలు, వాటర్ ట్యాంకులు, ఇంటిపై ఉన్న టైర్లు, ఖాళీ కొబ్బరి బోండాలు, ప్లాస్టిక్ డబ్బాల్లోనూ నీరు కూడా నిల్వ లేదు. కానీ డెంగీ దోమలు మాత్రం విజృంభిస్తున్నాయి. బస్తీలు, కాలనీలు, శివార్లు తేడా లేకుండా ఇటీవల ఆయా ప్రాంతాల్లో కొత్తగా అనేక బహుళ అంతస్తుల నిర్మాణాలు వెలుస్తున్నాయి. వీటి కింద ఉన్న నీళ్ల ట్యాంకులపై మూతలు లేక పోవడం, క్యూరింగ్ కోసం వాడిన నీరు రోజుల తరబడి నిల్వ ఉంచుతుండడం వల్ల నేడవి డెంగీ(టైగర్)దోమలకు నిలయంగా మారుతున్నాయి. ఆ పక్కనే ఉన్న సిటిజన్లపై పగటిపూట తమ పంజా విసురుతున్నాయి. ఫలితంగా జనవరి నుంచి జూలై వరకు జిల్లాలో 77 డెంగీ కేసులు మాత్రమే నమోదు కాగా, కేవలం ఒక్క ఆగస్టులోనే 132 కేసులు నమోదు కావడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. డెంగీ జ్వరాలను సకాలంలో గుర్తించకపోవడం, చికిత్సను జాప్యం చేయడంతో రక్తంలో ప్లేట్లెట్స్ కౌంట్ పడిపోయి రోగనిరోధక శక్తి తగ్గుతోంది. మనిషి రక్తంలో 1.50 లక్షల–4.50 లక్షల వరకు ప్లేట్లెట్స్ ఉంటాయి. జ్వరపీడితుల్లో ఈ కౌంట్ తగ్గుతుంది. ప్రస్తుతం ఆస్పత్రులకు వస్తున్న చాలా మంది రోగుల్లో ప్లేట్లెట్ కౌంట్ 40వేల లోపే ఉంటోంది. వాస్తవానికి 25 వేల వరకున్న పెద్ద ప్రమాదం ఏమీ ఉండదు. ఒకవేళ కౌంట్ 20 వేలకు పడిపోయి నోరు, ముక్కు నుంచి బ్లీడింగ్ అయితే వెంటనే ప్లేట్లెట్స్ పునరుద్ధరించాలి. లేదంటే షాక్కు గురై కోమాలోకి వెళ్లి చనిపోయే ప్రమాదం ఉంది.
మళ్లీ విజృంభిస్తున్న స్వైన్ఫ్లూ, డెంగీ
జిల్లాలో 26 ఫ్లూ, 209 డెంగీ కేసులు
ఆగస్టులోనే 132 డెంగీ ఫీవర్స్
చాపకింది నీరులా సీజనల్ వ్యాధులు


