● ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి
● జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డుల అందజేత
ఇబ్రహీంపట్నం: విద్యార్థుల భవిష్యత్తు తీర్చిదిద్దే నిర్మాణ ప్రక్రియ ఉపాధ్యాయుల చేతుల్లోనే ఉందని ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అన్నారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని శనివారం శేరిగూడలోని ఇందు కళాశాలలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవాన్ని నిర్వహించారు. జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు నేతృత్వంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరైన స్థానిక ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, అదనపు కలెక్టర్ కిరణ్మయి తదితరులు జిల్లా స్థాయిలో ఎంపికై న ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించి, జ్ఞాపిక, ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పాఠ్యాంశాలతో పాటు నైతిక విలువలు, క్రమశిక్షణ, సామాజిక బాధ్యతలపై విద్యార్థులకు అవగాహన కల్పించాలన్నారు. కొంతమంది డ్రగ్స్, గంజాయి, మాదక ద్రవ్యాలకు అలవాటు పడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారని...అలాంటి వారిపై ఉపాధ్యాయులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. దేశ భవిష్యత్తుకు ఉపాధ్యాయులే మార్గదర్శకులని, ఆ బాధ్యతను అంకితభావంతో నిర్వర్తించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆయా మండలాల విద్యాధికారులు, ఉత్తమ ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాల నేతలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.


